ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌత్ సెంట్రల్ రైల్వే సరికొత్త రికార్డు.. దేశంలోనే టాప్ ప్లేస్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 03, 2024, 09:43 PM

సరుకు రవాణాలో సౌత్ సెంట్రల్ రైల్వే సరికొత్త రికార్డు నెలకొల్పింది. దేశంలోనే అన్ని రైల్వేజోన్లతో పోల్చితే అత్యుత్తమ ప్రతిభ చూపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో సరకు రవాణాతో పాటు ఆదాయాన్నీ పొందింది. తొలిసారిగా సరకు రవాణాలో 140 మెట్రిక్‌ టన్నుల మార్కును దాటి 141.117 మెట్రిక్‌ టన్నుల రికార్డు సాధించిందని సౌత్ సెంట్రల్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.


2022-23 వార్షిక ఏడాదితో పోల్చితే ఇది 8.7 శాతం అధికమని వెల్లడించింది. గతేడాది కంటే రూ.506 కోట్ల ఆదాయం అదనంగా సమకూరినట్లు తెలిపింది. ఈ మేరకు మొత్తం రూ.13,438.76 ఆదాయాన్ని పొందినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. జోన్‌ పరిధిలోని ఆరు డివిజన్ల పనితీరుతో ఈ రికార్డు సాధ్యమైనట్లు వెల్లడించింది. రైల్వే సరకు రవాణాలో సౌత్ సెంట్రల్ రైల్వే వాటా 11.18 శాతంగా ఉందని చెప్పారు. సరకు రవాణాలో అగ్రస్థానంలో బొగ్గు (70.52 మెట్రిక్‌ టన్నులు), రెండోస్థానంలో సిమెంట్‌ (36.117 మెట్రిక్‌ టన్నులు) ఉన్నాయని చెప్పారు.


సింగరేణి సైతం సరికొత్త రికార్డు


బొగ్గు ఉత్పత్తి, వార్షిక టర్నోవర్‌లో సింగరేణి సైతం సరికొత్త రికార్డులు సృష్టించింది. గత నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరం(2023-24)లో సంస్థ చరిత్రలోనే అత్యధికంగా 7.2 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసినట్లు సంస్థ అధికారులు తెలిపారు. వివిధ పరిశ్రమలకు 6.9 కోట్ల టన్నుల బొగ్గను సరఫరా చేసింది. గతేడాది(2022-23)లో ఉత్పత్తి 6.71 కోట్ల టన్నులు, సరఫరా 6.66 కోట్ల టన్నులతో పోలిస్తే ఉత్పత్తిలో 4.3, సరఫరాలో 4.8 శాతం వృద్ధిరేటును సంస్థ నమోదు చేసింది. ఇక బొగ్గు, విద్యుత్‌ అమ్మకాలపై వార్షిక టర్నోవర్‌ రూ.37,420 కోట్లకు చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa