ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాదగిరిగుట్టలో వ్యాపారుల దోపిడి.. కొబ్బరికాయ, తులసి మాలకు అన్ని వందలా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 07, 2024, 07:26 PM

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. రాష్ట్ర నలుమూలల నుంచి స్వామివారి దర్శనం కోసం తరలివచ్చే భక్తులను నిలువునా దోచేస్తున్నారు కొబ్బరి కాయల వ్యాపారులు. స్వామివారిని దర్శించుకునే భక్తులు కొబ్బరికాయ కొట్టటం ఒక ఆనవాయితీగా వస్తుంటుంది. అయితే.. యాదగిరిగుట్ట కొండపైకి చేరుకున్న భక్తులకు కొబ్బరికాయ కొనేందుకు వెళ్తే.. స్వామివారికి తులసి మాల సమర్పించటం ఎంతో శ్రేష్టమంటూ భక్తులకు సెంటిమెంట్ మాటలు చెప్పి.. కొబ్బరికాయలతో పాటు తులసి మాలను కూడా కొనిపిస్తూ వ్యాపారులు కొత్త దందాకు తెర తీశారు.


అయితే.. ఒక కొబ్బరికాయ, దానితో పాటు ఓ చిన్న తులసి మాలకు కలిపి.. ఏకంగా రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి యాదగిరిగుట్టకు చేరుకున్న భక్తులకు ఏవో మాటలు చెప్పి.. భక్తుల జేబులకు గండి కొడుతున్నారు. అటు దర్శనం తొందరగా కావాలని టికెట్టు తీసుకొని.. ఇటు స్వామివారికి కొబ్బరికాయ కొట్టపోతే ఎలా అని దానికీ డబ్బులు పెడుతూ.. భక్తులు నిలువు దోపిడి సమర్పించుకుంటున్నారు. అంతా బాగానే ఉన్నా.. ఒక కొబ్బరికాయ, చిన్న తులసిమాలకు రెండు వందల రూపాయలకు అమ్మడం పట్ల భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. తీరా.. గుడిలోపలికి వెళ్తే.. ఆ మాలను దేవుడి పాదల చెంతకైనా చేరుస్తారా అంటే అదీ లేదు.. డైరెక్టుగా డస్ట్‌బిన్‌లోకే వెళ్తుంది. మరి ఆ మాత్రం దానికి ఇన్ని వందలు పెట్టటం అవసరమా..?


ఇది వర్తకులు చేస్తున్న మోసమని.. వాళ్ల జేబులు నింపుకునేందుకు భక్తులను దోచుకోవటం.. అది కూడా స్వామివారి సన్నిధిలోనే ఇలా జరుగుతుండటం శోచనీయమంటున్నారు. దీనిపై తక్షణమే ఆలయ ఈవో స్పందించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారికి మొక్కుగా సమర్పించే కొబ్బరికాయలను తక్కువ ధరలకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa