ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. రౌస్ అవెన్యూ కోర్టు ఆమె జ్యుడీషయల్ రిమాండ్ను పొడగించింది. ఈనెల 23 వరకు ఆమె కస్టడీని పొడిగిస్తూ తీర్పును వెలువరించింది. మార్చి 26న న్యాయస్థానం ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా.. నేటితో ఆ గడువు ముగిసింది. దీంతో తీహార్ జైలులో ఉన్న ఆమెను నేడు కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో ఆమె కస్టడీని పొడగించాలని ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మానీలాండరింగ్ కేసు విచారణ జరుగుతోందని ఈడీ కోర్టుకు వెల్లడించింది. ఈ సమయంలో కవిత బయటే ఉంటే కేసును ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటుందని.. అందువల్ల ఆమెకు మరో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
ఈడీ వాదనలపై కవిత తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. 2022 నుంచి ఈ కేసు నడుస్తోందన్నారు. కవిత ఎవర్నీ ప్రభావితం చేసే అవకాశం లేదని.. అందుకు ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. కవితను నేరుగా కోర్టులో మాట్లాడేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. కవిత తరపు న్యాయవాది విజ్ఞప్తిపై న్యాయమూర్తి కావేరి బవేజా అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిత మాట్లాడేందుకు అనుమతి నిరాకరించారు. నిందితురాలికి మాట్లాడే హక్కు ఉందని న్యాయవాది వాదించగా.. అందుకు అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అలాగే భర్త, మామను కోర్టు ఆవరణలో కలిసేందుకు కవితకు అనుమతి ఇవ్వాలని కోరగా.. అందుకు న్యాయమూర్తి సమ్మతించారు.
అనంతరం ఆమె కస్టడీనీ మరో 14 రోజులు అంటే ఈనెల 23 వరకు పొడగిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. దీంతో ఆమెను మరోసారి తీహార్ జైలుకు తరలించనున్నారు. తీర్పు అనంతరం కవితను బయటకు తీసుకెళ్లే సమయంలో మీడియాతో మాట్లాడారు. తనపై తప్పుడు కేసు పెట్టారన్నారు. రాజకీయ కుట్రతో ఈ కేసు పెట్టారన్నారని ఆక్షేపించారు. తనను సీబీఐ అధికారులు జైలులో విచారించారని.. తాను చెప్పాల్సిందంతా కోర్టులో చెప్పినట్లు వెల్లడించారు. కాగా, ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్ను నిన్న న్యాయస్థానం కొట్టేసిన సంగతి తెలిసిందే. ఆమె సాధారణ బెయిల్ పిటిషన్పై ఈనెల 16న వాదనలు జరగనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa