తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల పర్వం తుది దశకు చేరుకుంది. శనివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడగా.. రేపు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. 17 పార్లమెంట్ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల బందోబస్తు కోసం 73,414 సివిల్ పోలీసులు, 500 సెక్షన్ల TSSP సిబ్బంది, 164 కంపెనీల కేంద్ర బలగాలు, 3 కంపెనీల తమిళనాడు పోలీసులు, 2,088 మంది ఇతర శాఖల సిబ్బంది, సుమారు 7 వేల మంది హోంగార్డులు విధుల్లో నిమగ్నం కానున్నట్లు డీజీపీ రవి గుప్తా వెల్లడించారు.
ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన మార్చి 16 నుంచి శనివారం (మే 11) నాటికి రూ.186.12 కోట్ల విలువైన సొత్తు జప్తు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. వీటిలో రూ.93.94 కోట్ల నగదు, రూ.10.07 కోట్ల విలువైన మద్యం, రూ.7.86 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.62.77 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.11.48 కోట్ల విలువైన ఇతర పంపిణీ సామగ్రి ఉన్నాయన్నారు. డ్రగ్ కంట్రోల్ యాక్ట్, ఎక్సైజ్ చట్టం, ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద మొత్తం 8,863 కేసులు నమోదు చేశామన్నారు. వీటిలో ఒక్క ఎక్సైజ్ చట్టం కిందే 8,044 ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్పారు. నార్కోటిక్స్ కేసుల్లో 293, ఐపీసీ సెక్షన్ల కింద 473, ఆర్పీ యాక్ట్ కింద 53 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు వెల్లడించారు. 34,526 మందిని మందుస్తుగా బైండోవర్ చేశామని తెలిపారు. పోలింగ్కు మరో రోజు మాత్రమే గడువు ఉండటంతో ప్రలోభాల పర్వానికి తెరలేసే అవకాశం ఉందని.. ఇవాళ కూడా పటిష్ఠ నిఘా ఉంటుందని చెప్పారు. వజ్రాయుధం లాంటి ఓటును అమ్ముకోకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉపయోగించుకోవాలని డీజీపీ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa