తెలంగాణలో ఎన్నికల జాతర నడుస్తోంది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు పూర్తవగా.. నిన్నే లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ గ్యాప్లోనే వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరగనుంది. మే 27వ తేదీన జరగనున్న ఈ ఉపఎన్నిక బరిలో.. మొత్తంగా 52 మంది అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. కాగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు 63 మంది అభ్యర్థులు నామినేషన్లను వేయగా.. 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సోమవారంతో నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియగా.. చివరకు 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో.. ఈ ఉపఎన్నికకు కూడా గట్టి పోటీనే నెలకొంది. ఈ ఎన్నిక కూడా ప్రధాన పార్టీలకు పరీక్షగా మారాయి.
ఈ ఎమ్మెల్సీ స్థానానికి 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే.. గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందగా.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో.. ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్గొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతమున్న 12 జిల్లాల్లో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో 2,87,007 మంది పురుషులు కాగా, 1,74,794 మంది మహిళలు, ఇతరులు ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ హరి చందన వ్యవహరిస్తున్నారు.
అయితే.. ఈ ఉపఎన్నికకు కూడా ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్.. ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా చేజిక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ పార్టీ, అటూ బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్రులు కూడా గట్టిగానే బరిలో ఉండటంతో.. ఈ పోటీ రసవత్తరంగా మారనుంది. అయితే.. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పోటీ చేస్తున్నారు. 2021 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తీన్మార్ మల్లన్న.. రెండో స్థానంలో నిలిచారు. ఈసారి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఇక.. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీలో చాలా కాలం పని చేసిన రాకేష్ రెడ్డి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవటంతో కమలాన్ని వదిలి కారులో ఎక్కారు. దీంతో.. ఈ ఎన్నికల్లో ఆయనకు బీఆర్ఎస్ అధిష్ఠానం అవకాశం కల్పించింది. ఇక.. బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. 2021 ఎన్నికల్లో కూడా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు.
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు మే 27వ తేదీన పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుండగా.. ప్రస్తుతమున్న12 జిల్లాల పరిధిలో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నికలు జరుగుతుండగా.. జూన్ 5న కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa