గ్రామ, వార్డు సచివాలయాల్లో సిబ్బంది పనితీరుపై వస్తున్న ఫిర్యాదులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. సిబ్బంది ఎప్పుడు ఆఫీసుకు వస్తున్నారో, ఎప్పుడు బయటకు వెళ్తున్నారో తెలియని పరిస్థితి నెలకొందని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులు అందాయి. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి భేటీలో ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు సకాలంలో అందడం లేదన్న అంశంపై సీఎం సీరియస్ కావడంతో, యంత్రాంగం తక్షణమే దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది.
సచివాలయ వ్యవస్థలో క్రమశిక్షణను పెంచేందుకు అధికారులు భారీ ప్రక్షాళన చేపట్టారు. ముఖ్యంగా ఇతర శాఖలకు వెళ్లిన సిబ్బంది డిప్యుటేషన్లను తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయ సిబ్బంది ఎవరూ ఇతర పనులపై కాకుండా, కేటాయించిన గ్రామ లేదా వార్డు కార్యాలయాల్లోనే విధులకు హాజరు కావాలని స్పష్టం చేశారు. విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, ప్రజలకు అందుబాటులో ఉండకపోవడాన్ని ఉపేక్షించేది లేదని ఉన్నతాధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
హాజరు నమోదు ప్రక్రియలో కూడా కీలక మార్పులు తీసుకొచ్చారు. ఇకపై సిబ్బంది ప్రతిరోజూ కార్యాలయానికి హాజరై బయోమెట్రిక్ లేదా యాప్ ద్వారా అటెండెన్స్ వేయడం తప్పనిసరి చేశారు. ఏదైనా క్షేత్రస్థాయి పని నిమిత్తం బయటకు వెళ్లాల్సి వస్తే, సంబంధిత పై అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. కేవలం అనుమతి పొందిన తర్వాతే బయటకు వెళ్లాలని, ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ ప్రాంతం నుంచే జియో ట్యాగింగ్ యాప్ ద్వారా తన హాజరును ధ్రువీకరించుకోవాల్సి ఉంటుందని నిబంధనలు విధిస్తున్నారు.
వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు వివిధ స్థాయిల్లో పర్యవేక్షక అధికారులను ప్రభుత్వం నియమించింది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. సిబ్బంది పనితీరు, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తుల పరిష్కారం, కార్యాలయ వేళలను పాటించడం వంటి అంశాలను ఈ అధికారులు నిరంతరం పరిశీలిస్తారు. ఈ కొత్త నిబంధనల ద్వారా సచివాలయ వ్యవస్థ మళ్లీ గాడిలో పడుతుందని, ప్రజలకు మెరుగైన సేవలందుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa