తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సమరం ముగిసింది. ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ మే 13వ తేదీన ముగియగా.. ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఇక ఫలితాలు వెలువడటమే తరువాయి. అయితే.. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలవడనున్నాయి. సాధారంగా.. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రమే పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తాయి. ఇందులో కాగా.. ఏఏ స్థానాల్లో ఎవరెవరు గెలిచే ఛాన్స్ ఉంది.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి.. ఏ పార్టీకి ఓటింగ్ శాతం ఎక్కువగా వచ్చింది.. అన్న అంశాలు వెల్లడించనున్నాయి. అయితే.. దేశంలో ఇంకా మూడు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఎగ్జిట్ పోల్స్ కు కూడా అనుమతి లేకపోవటంతో.. అటు జనాల్లో, ఇటు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా గెలిచే సీట్లెన్ని, ఏఏ సీట్లు పక్కాగా గెలుస్తారన్న అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్కే అధిక సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేసిన భట్టి విక్రమార్క.. 12 నుంచి 14 సీట్లు పక్కాగా గెలువనుందని జోస్యం చెప్పారు.
ఇదిలా ఉంటే.. కేంద్రంలోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమే అధికారంలోకి వస్తుందని భట్టి విక్రమార్క ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ప్రజల్లో సెంటిమెంట్లు రెచ్చగొట్టేందుకు కొన్ని పార్టీలు యత్నించాయంటూ బీజేపీపై మండిపడ్డారు. దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఇండియా కూటమి వైపే ప్రజలు ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో టార్గెట్ 14 అంటూ రంగంలోకి దిగిన కాంగ్రెస్.. పదే పదే అదే మాట చెప్తూ వస్తున్నారు. ప్రచారం కూడా ఆ మేరకే.. చేసినట్టు కనిపించింది. మరి వాళ్లు అనుకున్నట్టుగా, ప్రచారంలో చెప్పినట్టుగా 14 సీట్లు వస్తాయో లేదో జూన్ 4వ తేదీ వరకు వేచి చేయాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa