తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు, కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం (మే 13) ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానికిక్ ఓటింగ్ మిషీన్లలో నిక్షిప్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 44 స్ట్రాంగ్ రూంలకు వాటిని తరలించారు. రాత్రి 12 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 64.93 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పట్టణాల్లో కంటే పల్లెల్లోనే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైంది.
పోలింగ్ రోజున ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు హాలీడే ప్రకటించాయి. ఓటేసేందుకుగాను పోలింగ్ రోజున సెలవు దినంగా ప్రకటించారు. అయితే ప్రజాస్వామ్యంలో ఓటు విలువైనది. దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటు మాత్రమే. అలాంటి ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టణ ప్రజలం బద్దకిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన హాలీడేనే ఓటు వేయకుండా జాలీడేగా భావిస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని కూడా ఓటింగ్కు దూరంగా ఉంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్లోనే అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదైంది. హైదరాబాద్లో 46.08 శాతం, సికింద్రాబాద్లో 48.11 శాతం, మల్కాజిగిరిలో 50.12 శాతం, చేవెళల్లో 55.45 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గాలన్నీ పట్టణ ప్రాంతం కిందకే వస్తాయి. ఇక్కడ అక్షరాస్యత కూడా ఎక్కువే. కానీ సామాజిక బాధ్యతే తక్కువ. అటువంటి ఈ పట్టణాలకు ఆదర్శంగా నిలిచిందో తండా. 100 శాతం పోలింగ్ నమోదు చేసి పట్టణవాసులను తలదించుకునేలా చేసింది.
మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100 శాతం పోలింగ్ నమోదైంది. తండాలోని ప్రజలందరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. తండాలో మెుత్తం ఓట్లు 210 కాగా.. వీరిలో 95 మంది పురుషులు, 115 మంది మహిళలు ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా మిస్ కాకుండా అందరూ ఓటు వేశారు. దీంతో తండాలో 100 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓటును మిస్ చేసుకోకుండా బాధ్యతగా ఓటేసిన తండావాసులను మెదక్ కలెక్టర్ అభినందించారు. కాగా, ఓటేసేందుకు బద్దకిస్తున్న పట్నం వాసులకు ఈ తండా ప్రజలు ఆదర్శం కావాలని పలువురు ప్రజాస్వామ్యవాదులు వ్యాఖ్యానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa