ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రవణ్ కిడ్నాప్‌ వ్యవహారంలో ట్విస్ట్.. తీసుకెళ్లింది ఎవరో తెలిసి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 08:01 PM

హైదరాబాద్ మల్కాజ్‌గిరి కార్పొరేటర్ శ్రవణ్‌కుమార్ కిడ్నాప్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ముందు శ్రవణ్‌‌ను కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేయగా.. ఆ తర్వాత అసలు ట్విస్ట్ బయటపడింది. ఆయన కిడ్నాప్ కాలేదని.. హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పుడు ఏం జరిగిందని ఆరా తీస్తే.. అసలు సంగతి బయటపడింది.


ఈ నెల 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని బహదూర్‌పురలోని ఓ పోలింగ్‌ బూత్‌లో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంపై ఆరా తీసిన పోలీసులు కేసు నమోదు చేసి.. హైదరాబాద్‌లో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కార్పొరేటర్ శ్రవణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన్ను కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత సైబర్‌క్రైమ్‌ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు క్లారిటీ ఇచ్చారు.


పోలింగ్ సమయంలో పాతబస్తీ బహదూర్‌పురలో రిగ్గింగ్‌ జరుగుతోందని ఓ వీడియోను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే ఈ వీడియో పాతదని ఎన్నికల సంఘం తేల్చింది.. ఆ వెంటనే హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కార్పొరేటర్‌ శ్రవణ్‌కుమార్‌తో పాటుగా నాంపల్లికి మహ్మద్‌ బిన్‌ అలీ, చాదర్‌ఘాట్‌కు చెందిన కాశీ, ముషీరాబాద్‌కు చెందిన మితిలేష్‌‌ను అరెస్ట్ చేశారు.. వీరు ఈ వీడియోను వైరల్ చేసినట్లు గుర్తించారు.


శ్రవణ్‌కు అదుపులోకి తీసుకునే సమయంలో గందరగోళం నడిచింది. మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్‌ సమీపంలో శ్రవణ్‌కు ఆఫీస్ ఉంది.. సాయంత్రం సమయంలో పోలీసులు రెండు వాహనాల్లో అక్కడికి వెళ్లారు. శ్రవణ్‌తో మాట్లాడిన పోలీసులు.. ఆ తర్వాత బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆయన్ను ఎవరు తీసుకెళుతున్నారో క్లారిటీ లేక కుటుంబసభ్యులు కిడ్నాప్ చేశారని భావించారు. ఆ తర్వాత శ్రవణ్‌ను తీసుకెళ్లిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తే.. పోలీసులు మఫ్టీలో వచ్చినట్లు గుర్తించారు. ఈలోపే శ్రవణ్ తండ్రి తన కుమారుడ్ని ఎవరో కిడ్నాప్ చేశారంటూ మల్కాజ్‌గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు పోలీసులు కార్పొరేటర్ శ్రవణ్ సహా నలుగుర్ని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. అయితే శ్రవణ్‌కు ఎందుకు తీసుకెళుతున్నారో ఒకమాట చెబితే సరిపోయేదని.. బలవంతంగా తీసుకెళ్లడం సరికాదన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు బీజేపీ నేతలు.. కుటుంబ సభ్యులకు సమచారం ఇచ్చిన తర్వాత తీసుకెళితే సరిపోయేదన్నారు. మొత్తం మీద కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ అరెస్ట్ వ్యవహారం మల్కాజ్‌గిరిలో చర్చనీయాంశమైంది.. అందర్నీ కొద్దిసేపు టెన్షన్ పెట్టించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa