ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీసీసీపదవికి రేవంత్ రెడ్డి రాజీనామా.. టీ కాంగ్రెస్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 09:16 PM

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో సమీకరాలు వేగంగా మారుతూ వస్తున్నాయి. అయితే.. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు జరగ్గా.. ఎలాంటి ఫలితాలు రానున్నాయి.. అవి రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే.. ఈ సమయంలోనే మరో కొత్త అంశం తెర మీదికి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయనున్నారని.. త్వరలోనే ఆయన స్థానంలో మరో లీడర్ పగ్గాలు చేపట్టనున్నారన్న వార్త చర్చనీయాంశంగా మారింది. అయితే రేవంత్ రెడ్డి రాజీనామా చేసేది సీఎం పదవికి కాదండోయ్.. టీపీసీసీ పదవికి.


అయితే.. లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం జరగనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది కూడా. ఇక.. జూన్ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండటంతో వాటికి ముందే.. కొత్త అధ్యక్షుడిని నియమించే ఛాన్స్ ఉంది. దీంతో.. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు. దీంతో.. ఆశావహులు చాలామంది దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు.


ఇదిలా ఉంటే.. టీపీసీసీ పదవి రేసులో చాలా మంది ముఖ్య నేతలు ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే రెడ్డి సామాజికవర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటంతో.. పీసీసీ పదవిని ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీన్ని బట్టి.. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారికి ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తే.. భట్టి విక్రమార్కకు అవకాశం ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. సీఎం రేసులో పోటీ పడిన భట్టి విక్రమార్క.. ఆ పదవి దక్కకపోవటంతో.. ఇటు పీసీసీ బాధ్యతలైన ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం.


మరోవైపు... నాగర్ కర్నూల్ ఎంపీ సీటు ఆశించి భంగపడిన సంపత్ పేరు కూడా ఈ రేసులో వినిపిస్తోంది. వీళ్లే కాకుండా.. బీసీ సామాజికవర్గం నుంచి మధుయాష్కీ గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో మధుయాష్కీగౌడ్ రాహుల్ గాంధీకి సన్నిహితుడు కాబట్టి ఆయనకే ఈ పదవి వచ్చే అవకాశాలున్నాయని చర్చించుకుంటున్నారు. మహేష్ కుమార్ గౌడ్, అంజన్‌ కుమార్ యాదవ్‌లిద్దరికీ రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉంటుందని కాబట్టి.. అతను ఎవరిపేరు ప్రతిపాదిస్తే వారికే పీసీసీ పీఠం దక్కే ఛాన్స్ ఉందని కనిపిస్తోంది.


ఒకవేళ.. మైనార్టీల నుంచి ఇవ్వాలనుకుంటే మాత్రం ప్రధానంగా వినిపించే పేరు.. షబ్బీర్ అలీ. ఇప్పటికే.. ఆయన చాలా త్యాగాలు చేయటంతో.. అధిష్ఠానం ఆయనకు పెద్ద హామీనే ఇచ్చిందన్న టాక్ కూడ నడుస్తోంది. పైగా పార్టీలో సీనియర్ కూడా కావటంతో.. ఆయకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక.. ఎస్టీ సామాజికవర్గానికి ఇవ్వాలనుకుంటే మాత్రం మంత్రి సీతక్క పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. పీసీసీ రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ముందు నుంచి ఆయనకు మంత్రి పదవి కావాలని పట్టుబడుతుండగా.. ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇప్పటికే మంత్రి పదవి ఇవ్వగా.. ఆయనకు ఇచ్చే అవకాశం కనిపించట్లేదు. దీంతో.. కనీసం టీపీసీసీ అయినా ఇవ్వాలని కోరుతున్నట్టు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa