ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ మంత్రి మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 18, 2024, 07:50 PM

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ భూ వివాదంలో హైదరాబాద్‌ పేట్ బషీరాబాద్ పోలీసులు మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. తాను కొనుగోలు చేసిన భూమిని మరొకరు ఆక్రమించారని మల్లారెడ్డి ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి అదుపుతప్పే పరిస్థితి ఉండటంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.


వివరాల్లోకి వెళితే.. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82 లో భూవివాదం ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు మరికొంత మంది స్థానికుల మధ్య ఈ వివాదం నడుస్తోంది. సర్వే నెంబర్‌ 82 లోని రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అయితే అందులో 1.11 ఎకరాల భూమి తమదంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని చెప్పారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని చెబుతున్నారు. మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని 15 మంది ఆరోపిస్తున్నారు.


ఈ క్రమంలో ఇవాళ ఉదయం వివాదస్పద స్థలం వద్దకు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి చేరుకున్నారు. స్థలంలో ఏర్పాటు చేసిన ఇనుప కంచెను అనుచరులతో కలిసి కూల్చేశారు. దీనిపై సదరు 15 మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకు సర్డి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మల్లారెడ్డి వినిపించుకోకపోవటంతో ఆయన్ను, అల్లుడు రాజశేఖర్ రెడ్డిని స్టేషన్‌కు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa