ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్.. వడ్లకు రూ.500 బోనస్‌పై కీలక నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 20, 2024, 08:16 PM

 రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. ధాన్యం కొనుగోళ్ల వేగవంతం, తడిచిన ధాన్యానికి మద్దతు ధర , ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వటం లాంటి అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈరోజు (మే 20న) సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుదీర్ఘంగా కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.


ముఖ్యంగా.. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయించనట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. సాఫీగా ధాన్యం కొనుగోళ్లు జరిగేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు. ఈ మేరకు.. రేపటి నుంచి జిల్లా కలెక్టర్లు, అధనపు కలెక్టర్లు, అధికారులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు. కాగా.. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ధాన్యంపై రూ.500 బోనస్ ఇచ్చేందుకు కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే.. వచ్చే సీజన్ నుంచి సన్నవడ్లకు మద్దతు ధరపై 500 రూపాయల బోనస్ ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయించినట్టు వెల్లడించారు.


రాష్ట్రంలోని పాఠశాలు, గురుకులాల్లో సన్న బియ్యం సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించగా.. అందుకు పక్కరాష్ట్రాల నుంచి సన్నబియ్యాన్ని దిగుమతి చేసుకోవటం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈమేరకు.. రాష్ట్రంలోనే.. రైతులు పండించే సన్నబియ్యాన్నే కొనుగోలు చేసి.. సరఫరా చేయనున్నట్టు పేర్కొన్నారు. కాగా.. ఏ ఏ రకాల సన్న వడ్లు కొనుగోలు చేయాలన్నది.. ప్రభుత్వం వెల్లడిస్తుందని తెలిపారు.


ఇక.. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలకు చాలా చోట్ల ధాన్యం తడిసిపోతుందని మంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో.. రైతులు ఎవ్వరూ అధైర్యపడొద్దని.. తడిచిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పుకొచ్చారు. తడిచిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనాలని మంత్రి వర్గం నిర్ణయించినట్టు తెలిపారు. ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పిన నమ్మొద్దని తెలిపారు.


ఇక.. నకిలీ విత్తనాలు అమ్మేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. తెలంగాణలో నకిలీ విత్తనాల అమ్మకాలను పూర్తిగా నిర్మూలించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిపారు. రైతులందరూ.. ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. లూజు విత్తనాలు కొనొద్దని సూచించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa