ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో అందరికీ కొత్త రేషన్ కార్డులు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, May 22, 2024, 04:51 PM

తెలంగాణలో కీలక నిర్ణయాలతో పాలనతో తనదైన మార్కు చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వగా.. ఆ హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తులు స్వీకరించింది. వీటిపైన అధికారులు స్క్రూటినీ కూడా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే.. తాజాగా కొత్త రేషన్ కార్డులపైన రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.


కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్న ప్రభుత్వం.. రేషన్ కార్డుల రూపం మార్చాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాతవాటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. లోక్ సభ ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే.. ఇందుకు సంబంధించిన కసరత్తును వేగవంతం చేయనుంది. ఆరోగ్యశ్రీ కార్డు పరిమితి గతంలో ఉన్న 5 లక్షలను రేవంత్ సర్కార్.. పది లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది.


రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డ్ ఓ చిన్న పుస్తకం తరహాలో పంపిణీ చేశారు. కాగా.. ఇప్పుడు వీటిని మార్చాలని ప్రభుత్వం సూచనాప్రాయంగా నిర్ణయించింది. గతంలో ఉన్న ఆహారభద్రత కార్డుల స్థానంలో రైతుబంధు పాస్ బుక్ సైజులో రేషన్ కార్డులు జారీ అయ్యాయి. ముందువైపు కుటుంబ సభ్యుల గ్రూప్ ఫోటో, కింద కుటుంబ సభ్యుల వివరాలు ఉంటే.. వెనకవైపు చిరునామా, ఇతర వివరాలు ఉండేవి.


  ఆ తర్వాత రేషన్ కార్డుల స్థానంలో ఆహార భద్రత కార్డులు వచ్చాయి. ఒక పేజీతో ఒక వైపే ఉండే ఈ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫోటోలు లేకుండానే కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్ దుకాణం కార్డు సంఖ్య మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మంజూరు చేయనున్న కొత్త కార్డులో ఎలాంటి వివరాలు పొందుపరచాలి అనే అంశం పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తం కుటుంబానికి సంబంధించిన సమాచారం ఒకే కార్డులో అందుబాటులో ఉండేలాగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.


తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే రైతు రుణమాఫీతో పాటుగా కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం ఈసీ నుంచి తాజాగా వచ్చిన మార్గదర్శకాల మేరకు ఆ విషయాలపై ఎలాంటి చర్చ జరగలేదు. ప్రజాపాలన ద్వారా స్వీకరించిన దరఖాస్తుల్లో ఎక్కువ సంఖ్యలో కొత్త రేషన్ కార్డుల కోసమే అభ్యర్థనలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో కోడ్ పూర్తయిన వెంటనే.. ఉన్నతాధికారులతో ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష ఏర్పాటుకు నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa