ట్రెండింగ్
Epaper    English    தமிழ்

75 శాతం సంపాదన సమాజానికే ఇచ్చేస్తా- వేదాంతా ఛైర్మన్ భావోద్వేగం

business |  Suryaa Desk  | Published : Fri, Jan 09, 2026, 11:05 PM

భారత్‌కు చెందిన దిగ్గజ సంస్థల్లో వేదాంత గ్రూప్ ఒకటి. ఇది సహజ వనరులు, చమురు, జింక్, సీసం, అల్యూమినియం, రాగి, ఇనుప ఖనిజం, చమురు ఇలా దాదాపు అన్ని రంగాల్లో వ్యాపారాలు చేస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాల్ని విస్తరించింది. ఈ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అనిల్ అగర్వాల్ , ఆయన కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. అనిల్ అగర్వాల్ కుమారుడు.. అగ్నివేశ్ అగర్వాల్ 49 ఏళ్ల వయసులో 2026, జనవరి 7న ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల అమెరికాలో స్కీయింగ్ ప్రమాదంలో గాయపడ్డ అగ్నివేశ్‌.. కొద్దిరోజులుగా న్యూయార్క్‌లోని మౌంట్ సినాయ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆస్పత్రిలోనే అకస్మాత్తుగా సంభవించిన గుండెపోటుతో మరణించారు.


వేదాంత అనుబంధ సంస్థ తల్వండి సాబో పవర్ లిమిటెడ్‌కు అగ్నివేశ్ అగర్వాల్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో 2005-19 మధ్య హిందుస్థాన్ జింక్ ఛైర్మన్‌గా పనిచేశారు. యూఏఈలో ఫుజైరా గోల్డ్ అనే మెటల్ రిఫైనరీ కంపెనీ స్థాపించారు. కుమారుడి మరణంపై స్పందించిన అనిల్ అగర్వాల్.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ట్విట్టర్‌లో (x) సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. కుమారుడి మరణంతో తన జీవితంలో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఒక కీలక ప్రకటన చేశారు. గతంలో అగ్నివేశ్‌కు మాట ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తమ సంపాదనలో 75 శాతానికి మించి సమాజానికి తిరిగి ఇస్తానని పునరుద్ఘాటించారు. గతంలోనే తన కుమారుడికి చెప్పగా.. ఇప్పుడు బహిరంగంగా సోషల్ మీడియా పోస్టులో వివరించారు.


'మా కుమారుడు అగ్నివేశ్ చాలా చిన్న వయసులోనే మమ్మల్ని విడిచివెళ్లాడు. అతడి వయసు 49 సంవత్సరాలే. భవిష్యత్తు గురించి ఎన్నో కలలు ఉండేవి. అమెరికాలో స్కీయింగ్ ప్రమాదంలో గాయపడ్డ అగ్నివేశ్.. ఆస్పత్రిలో కోలుకుంటున్న సమయంలోనే కార్డియాక్ అరెస్ట్ కావడంతో మమ్మల్ని విడిచివెళ్లాడు. తన జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా.. ఒదిగే ఉండేవాడు. నా వెంట ఒక స్నేహితుడిలా ఉండేవాడు. దేశం స్వావలంబన దిశగా పయనిస్తుందని బలంగా నమ్మేవాడు. మా సంపాదనలో 75 శాతం కంటే ఎక్కువ సమాజానికే ఇస్తానని అతడికి మాట ఇచ్చాను. ఆ వాగ్దానాన్ని ఇప్పుడు పునరుద్ఘాటిస్తున్నా. నువ్వు లేకుండా ఈ దారిలో ఎలా ముందుకెళ్లాలో నాకు తెలియట్లేదు. అయినా నీ ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా.' అని అనిల్ అగర్వాల్ ట్విట్టర్‌ పోస్ట్‌లో వివరించారు.


అనిల్ అగర్వాల్‌కు అగ్నివేశ్‌తో పాటు మరో కుమార్తె ప్రియ ఉన్నారు. ఆమె కూడా వేదాంత లిమిటెడ్ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్. అనిల్ అగర్వాల్ నికర సంపద 330 కోట్ల డాలర్లుగా ఉంటుందని అంచనా. భారత కరెన్సీలో చూస్తే ఇది సుమారు రూ. 30 వేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa