కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హ్యాట్రిక్ పీఎంగా నరేంద్ర మోదీ ప్రమాణం చేశారు. మోదీతో పాటు ఏకంగా 72 మంది కేంద్రమంత్రులు కూడా ప్రమాణం చేశారు. మోదీ 3.0 జట్టులో ఈసారి తొలిసారిగా తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు దక్కాయి. ఇప్పటికే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి మరోసారి మోదీ జట్టులో అవకాశం రాగా.. కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్కు కూడా ఈసారి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే.. మోదీ కేబినెట్లో చోటు దక్కించుకునేవారిలో ఈటల రాజేందర్, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్ పేర్లు కూడా ఉన్నట్టు ప్రచారం జరిగింది. చివరికి.. బండి సంజయ్, కిషన్ రెడ్డికి మాత్రమే చోటు దక్కింది.
కేంద్రమంత్రి పదవి దక్కకపోవటంపై ఈటల రాజేందర్ తొలిసారిగా స్పందించారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్.. ప్రతి సభ్యుడికి బాధ్యతలు అప్పగించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన డిమాండ్లు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకే అధిష్ఠానం పలు కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. తన పాత్రను తాను నిర్ణయించలేననన్నారు. తన చేతిలో ఏమీ లేదన్నారు. వేర్వేరు సభ్యులకు వేర్వేరు బాధ్యతలు అప్పగించడం తమ పార్టీ బాధ్యత అని.. తనకు ఏ బాధ్యతలు అప్పగించాలో అధిష్ఠానం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఈటల రాజేందర్కు అప్పగించనున్నారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే.. ఈరోజు అమిత్ షాతో ఈటల ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఈ విషయంపై చర్చించనున్నారని.. ఆ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.
మరోవైపు.. ఒకే పార్టీ నుంచి ఒకే వ్యక్తి మూడోసారి ప్రధానమంత్రి కావటమనేది ఒక చరిత్ర అని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. 1962 తర్వాత మూడోసారి ఒకే పార్టీ నుంచి ఒకే వ్యక్తి ప్రధాని కావడం చాలా గొప్ప విషయమన్నారు. దేశప్రజలు అంతా తమ ఆత్మను ఆవిష్కరించి ఓట్లు వేశారని ఈటల అభిప్రాయపడ్డారు. 2014, 2019లో బీజేపీ సర్కారు చేసిన అభివృద్ధికి ప్రజలు ఎంతగానో సంతోషించి మూడోసారి కూడా అధికారం అప్పజెప్పారని చెప్పుకొచ్చారు.
దేశంలోనే అతిపెద్ద లోక్ సభ నియోజక వర్గమైన మల్కాజిగిరి నుంచి దాదాపు 4 లక్షల మెజారిటీతో తనను గెలిపించిన ప్రజలకు ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రాష్ట్రంలో మంత్రిగా కొనసాగినప్పటికీ, కేంద్ర ప్రభుత్వంతో కలిసి మోదీ నాయకత్వంలో లోక్సభలో ఎంపీగా కొనసాగడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. దేశంలోని పేదరిక నిర్మూలనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఈటల తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa