ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ అమలుకు విధివిధానాలు సిద్ధం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 07:32 PM

తెలంగాణ రైతులకు భారీ శుభవార్త చెప్పేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమవుతోంది. ఆగస్టు 15వ తేదీలోపు రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని లోక్ సభ ఎన్నికల్లో పదే పదే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పుడు.. ఆ దిశగా కసరత్తు చేస్తన్నారు. ఈ క్రమంలోనే.. ఈ నెస 18న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో రైతు రుణమాఫీ అమలుకు సంబంధించిన విధి విధానాలను అధికారికంగా ఆమోదించనున్నట్టు తెలుస్తోంది. దీనితో పాటు.. రాబోయే ఐదేళ్లకు సంబంధించి సంక్షేమ, అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండాలన్న దానిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.


అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు రూ 2లక్షల వరకు రైతు రుణ మాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వగా.. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలోనూ ఆగస్టు 15 లోగా రుణమాఫీ అమలు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తూ వచ్చిన విషయం తెలసిందే. ఈ మేరకు.. రైతు రుణమాఫీకి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రుణమాఫీకి సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు.


2019 ఏప్రిల్‌ 1 నుంచి 2023 డిసెంబరు 10వ తేదీ వరకు రైతులు తీసుకున్న రుణాలకు ఈ మాఫీ వర్తించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతుల రుణాలకు సంబంధించిన సమాచారం కోసం బ్యాంకర్లతోనూ అధికారులు చర్చలు జరిపారు. బ్యాంకర్లు ఇచ్చిన డేటా ఆధారంగానే రుణమాఫీ చేయనున్నారు. అయితే.. రుణమాఫీ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపైన అధికారులు ఇప్పటికే సూత్రప్రాయంగా నివేదిక అందించారు. ఈ మార్గదర్శకాలపై ఈ నెల 18న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు. గతంలో రుణమాఫీ చేసినప్పుడు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపజేయగా.. ప్రస్తుతం ఎలాంటి నిబంధనలు తీసుకురానున్నారనే అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది.


తెలంగాణలో రైతు రుణమాఫీ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు నేరుగా జమ అయ్యేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. ప్రభుత్వంలోని కొన్ని శాఖల నుంచి ఆ కార్పోరేషన్‌కు డబ్బు బదిలీ చేసి.. తిరిగి ఆ మొత్తం చెల్లించేలా నిర్ణయం కూడా జరిగినట్టు తెలుస్తోంది. కొందరు రైతులు బ్యాంకు రుణాలు తీసుకుని.. రెన్యువల్ చేసుకోలేదు. మరి వారికి మాఫీ వర్తిస్తుందా లేదా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఈ దిశగా బ్యాంకర్లతో వ్యవసాయ, ఆర్థికశాఖ ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. రుణమాఫీ అమల్లో ఎక్కువ మందికి లబ్ది జరిగేలా నిర్ణయం ఉండాలని రేవంత్ భావిస్తున్నారు. దీంతో.. ప్రభుత్వం ప్రకటించే రుణమాఫీ విధి విధానాల పైన సర్వత్రా ఆసక్తి రేకెత్తుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa