ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుల ఖాతాల్లో రూ.10,355 కోట్లు.. రేవంత్ సర్కార్ వెల్లడి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 10, 2024, 08:41 PM

రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పాటుపడుతోందని రేవత్ సర్కార్ మరోసారి స్పష్టం చేసింది. యాసంగి సీజన్‌లో తెలంగాణవ్యాప్తంగా 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 6,345 కేంద్రాల ద్వారా 47.07 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు స్పష్టం చేసింది. ధాన్యం విక్రయించిన 8,35,109 మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో రూ.10,355.18 కోట్లు జమచేసినట్లు స్పష్టం చేసింది. వడ్లు అమ్మిన మూడు రోజుల్లోనే డబ్బు రైతుల అకౌంట్లో వేసినట్లు పేర్కొంది.


 ఈ ధపా ధాన్యం సేకరణలో నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్గొండ, సంగారెడ్డి, నిర్మల్, జనగామ, మంచిర్యాల జిల్లాలు ముందంజలో ఉన్నాయని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏప్రిల్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవని.. ఈసారి మాత్రం దాదాపు రెండు వారాల ముందుగానే మార్చి 25 నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. జూన్‌ 7న రాష్ట్రవ్యాప్తంగా 47.07 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగాయన్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల సేకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మరో 10 రోజులపాటు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అంచనా వేస్తోంది.


ఆలస్యంగా పంటలు వేసిన రైతులకు ఇబ్బంది తలెత్తకుండా నెలాఖరు వరకు అవసరమైన చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి ఉంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. యాసంగి సీజన్‌లో దాదాపు 75.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేసినట్లు వెల్లడించారు. మార్కెట్‌లో మద్దతు ధర కంటే ఎక్కువ సొమ్ము లభించడం, ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి మంచి ధరకు ధాన్యం కొనుగోలు చేయడం వల్ల అంచనా వేసిన విధంగా ధాన్యం రాలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa