నైరుతి రుతుపవనాలు తెలంగాణలో క్రమంగా విస్తరిస్తున్నాయి. రానున్న రెండ్రోజుల్లో తెలంగాణ అంతటా రుతపవనాలు విస్తరించే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు చెప్పారు. దీనికి తోడు తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతోందని... దీని ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు.
నేడు రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ నాగర్ కర్నూల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, హైదరాబాద్ జిల్లాల్లో వర్షం కురుస్తుందన్నారు. భారీ ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని.. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులుపడే ఛాన్స్ ఉందని జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. రుతుపవనాలు వేగంగా వ్యాపించడం, ఉపరితల ఆవర్తనం కారణంగా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఇక ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల ఇంకా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించిన తర్వాత ఉత్తర తెలంగాణలో సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అటు ఏపీలోనూ కొ న్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో వానలు పడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa