తల్లిదండ్రులను పున్నామ నరకం నుంచి బయటపడేసే వాడే పుత్రుడు అంటారు కానీ.. ఈ కుమారుడు మాత్రం కన్న తల్లిదండ్రులనే కడతేర్చిన నరరూప రాక్షసుడు. కేవలం మూడున్నర తులాల బంగారం కోసం కన్న తల్లిదండ్రులను అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఈ అత్యంత అమానవీయ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. నిందితుని సోదరి.. తన తల్లిదండ్రుల గురించి 25 రోజులుగా చేసిన పోరాటంతో.. చివరికి అసలు విషయం బయటపడింది.
హత్నూర మండలానికి చెందిన సాదుల్లానగర్ నివాసి అయిన సాకలి లక్ష్మణ్ బ్రతుకు తెరువు కోసం.. దుండగల్లో ఒక ప్రైవేట్ ఉద్యోగం చేయడానికి వెళ్లాడు. అక్కడ అనేక వ్యసనాలకు లోనైన లక్ష్మణ్.. అప్పులపాలయ్యాడు. దీంతో.. డబ్బుల కోసం కన్నతల్లి మెడలో ఉన్న బంగారంపై కన్నేశాడు. ఎలాగైనా తల్లి దగ్గరి నుంచి బంగారం తీసుకోవాలని నిర్ణయించుకున్న లక్ష్మణ్.. పథకం రచించాడు. ప్లాన్ ప్రకారం మే 22 రోజున తన తల్లిదండ్రులను దుండిగల్ తీసుకెళ్లాడు. అందరూ కలిసి ఆల్కహాల్ సేవించి విందు చేసుకున్నారు. ఎక్కడి వాళ్లు అక్కడ నిద్రలోకి జరుకున్న తర్వాత.. భార్యతో కలిసి.. తల్లిదండ్రులను గొంతునులిమి కడతేర్చాడు.
ఆ తర్వాత కారులో నర్సాపూర్ అటవీ సమీపంలోని రాయరావు చెరువు చెట్ల పొదల్లో తల్లిదండ్రుల శవాలపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఇట్టి విషయాన్ని గప్చుప్గా ఉంచిన భార్యాభర్తలు ఏమి తెలియనట్టు ఉన్నారు. దీంతో.. లక్ష్మణ్ కుమార్తె.. తన తల్లిదండ్రుల జాడకోసం వెతకని ఊరు లేదు, వెతకని జాడ లేదు. ఇక పుట్టిన ఊరికి వచ్చి.. తన తల్లిదండ్రుల గురించి వాకబు చేసింది. గ్రామంలో ప్రజలంతా కిష్టయ్య, నర్సమ్మల గురించి కుమారుడు లక్ష్మణ్ని నిలదీశారు. " మీ అమ్మానాన్నలను నువ్వే తీసుకెళ్లావు.. ఏంచేశావు.." అంటూ నిలదీయటంతో నిందితుడు ఖంగుతిన్నాడు. గ్రామస్తులు అందరూ కలిసి లక్ష్మణ్పై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్లో అడిగే సరికి.. తల్లిదండ్రులను తానే చంపినట్టు అంగీకరించాడు. దీంతో.. లక్ష్మణ్తో పాటు అతని భార్య అనితను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa