గత ప్రభుత్వం తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి సర్కార్.. ఓ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేపిస్తున్న విషయం తెలసిందే. కాగా.. కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ విచారణలో వేగం పెంచారు. కేసీఆర్ సర్కారులో కీలకంగా వ్యవహరించిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులను విచారణ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు (జూన్ 15వ తేదీన).. రిటైర్డ్ ఇంజనీర్ల బృందంతో కాళేశ్వరం కమిషన్ సమావేశమైంది.
2015లో ఏర్పాటైన అనంతరాములు కమిటీలోని రిటైర్డ్ ఇంజనీర్లు కాళేశ్వరం కమిషన్తో సమావేశమైంది. అప్పటి రిపోర్ట్ను జస్టిస్ చంద్రఘోష్కు రిటైర్డ్ ఇంజనీర్లు సమర్పించారు. మేడిగడ్డ బ్యారేజీని అక్కడే నిర్మించాలని కేసీఆరే సూచించారని.. తాము ఇచ్చిన రిపోర్ట్ను పట్టించుకోలేదని.. ఆయన చెప్పినట్టే చేశామని రిటైర్డ్ ఇంజనీర్లు వెల్లడించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రపోజ్ చేసినా వద్దని పక్కనపడేశారని.. తాము రిపోర్ట్ను అప్పటి ఇరిగేషన్ మినిస్టర్, మాజీ సీఎం కేసీఆర్కు అందించినా సంతకం చేయలేదని ఇంజనీర్లు తెలిపారు.
మరోవైపు.. సబ్ కాంట్రాక్ట్ వ్యవస్థపై జస్టిస్ చంద్రఘోష్ ఆరా తీశారు. కాంట్రాక్ట్ ఏజెన్సీల అకౌంట్స్, స్టేట్మెంట్స్ పరిశీలించే యోచనలో ఉన్నట్టు తెలిపారు. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి డేటా తీసుకోవాలని యోచిస్తున్నారు. ఆ అకౌంట్ల లెక్కలు చూస్తే ఎంత చేతులు మారాయనేది తెలుస్తుందని భావిస్తున్నారు. తాను పిలిస్తే ఎవరైనా విచారణకు రావాల్సిందేనన్న జస్టిస్ ఘోష్.. రాకుంటే ఏం చేయాలో తనకు తెలుసని.. అందుకు తనకు అధికారాలున్నాయని తెలిపారు.
అన్ని అఫిడవిట్లు పరిశీలించాక అవసరమైతే సీడబ్ల్యూసీ వాళ్లనూ పిలుస్తామని జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ తెలిపింది. 10 నుంచి 15 సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారని.. వాటి వివరాలనూ సేకరించే పనిలో కమిషన్ నిమగ్నమైంది. ఏఈఈ, డీఈఈలను విచారించాలా లేదా అన్నది తర్వాత ఆలోచిస్తామన్నారు. ప్రస్తుతానికి ఇంజనీర్లతో విచారణ పూర్తి కాగా... మళ్లీ అఫిడవిట్లు వచ్చాకే విచారణ చేయనున్నట్టు తెలుస్తోంది.
అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన తర్వాత తదుపరి కార్యచరణను కమిషన్ ప్రారంభించింది. అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్లను విచారణకు పిలిచి వారి నుంచి మరింత సమాచారం సేకరించే పనిలో కాళేశ్వరం కమిషన్ దృష్టి సారించింది. అఫిడవిట్ పరిశీలన తర్వాత ఓపెన్ కోర్టులోనే మరోసారి అందరిని కాళేశ్వరం కమిషన్ క్రాస్ ఎగ్జామినింగ్ చేయనున్నట్లు సమాచారం. కాగా.. కాళేశ్వరం ప్రాజెక్ట్లో బ్యారేజీల నిర్మాణంపై విచారణను ముమ్మరం చేసింది. ఏజెన్సీలను అఫిడవిట్ ఫైల్ చేయమని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ స్పష్టం చేశారు. ఆ అఫిడవిట్లపై విచారణ కొనసాగుతోందని వివరించారు. టెక్నికల్ అంశాలు సిద్ధమైన తర్వాత ప్రజా ప్రతినిధులకు నోటీసులు ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత మాజీ భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీశ్రావు, ముఖ్యమంత్రి కేసీఆర్ని విచారణకు పిలుస్తామని వెల్లడించారు. జూలై రెండో వారం లేదంటే ఆ తర్వాత విచారణకు పిలుస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావుకు త్వరలో నోటీసులు అందే అవకాశం ఉంది. ఆ తర్వాత కేసీఆర్కు ఇస్తారని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa