ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో చంద్రబాబు వస్తే, హైదరాబాద్‌కు వచ్చిన నష్టమేమీ లేదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 07:55 PM

హైటెక్స్, హైదరాబాద్: పక్క రాష్ట్రంలో ఏదో జరగబోతుందనో, దేశంలో ఎక్కడో ఏదో జరిగిందనో.. హైదరాబాద్‌కు వచ్చిన నష్టమేమీ లేదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, ఇతరత్రా వసతుల దృష్ట్యా హైదరాబాద్ నగరం దేశంలోనే బెస్ట్ ప్లేస్ అని ఆయన స్పష్టం చేశారు. ఇది తాను చెబుతున్న మాట కాదని, మేధావులు, వివిధ సంస్థల ప్రతినిధులు చెప్పిన మాట అని ఆయన అన్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందని, హైదరాబాద్‌కు ఏదో నష్టం జరగబోతోందనే వార్తలు కరెక్ట్ కాదని మంత్రి పొంగులేటి అన్నారు. హైదరాబాద్ భవిష్యత్తుకు ఢోకా లేదని చెప్పారు. ఎందుకంటే ఈ నగరానికి ఉన్న భౌగోళిక వనరులు, ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలే అందుక్కారణమని తెలిపారు. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై లాంటి నగరాల కంటే హైదరాబాద్ ఉత్తమమని పలు సంస్థల ప్రతినిధులే చెప్పారని మంత్రి గుర్తుచేశారు.


హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో శనివారం (జూన్ 15) ఉదయం.. టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, ఆప్టిమల్ మీడియా సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టైమ్స్ హోమ్ హంట్‌ ప్రాపర్టీ ఎక్స్‌పో’ నాలుగో ఎడిషన్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ ఎక్స్‌పోలో 100కి పైగా ప్రాజెక్టులు, 40 మంది ప్రముఖ బిల్డర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగులేటి ప్రసంగిస్తూ.. హైదరాబాద్ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు.


ఏపీలో చంద్రబాబు వచ్చారని, హైదరాబాద్‌కు జరిగే నష్టమేం లేదు: మంత్రి పొంగులేటి


నగరాన్ని అన్ని విధాల సుందరీకరణ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొంగులేటి తెలిపారు. తెలంగాణలో పెట్టుబడిదారులకు మరింత సానుకూల వాతావరణం కల్పించేలా తమ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. రానున్న రోజుల్లో విశేష అభివృద్ధిని చూస్తారని అన్నారు. ‘ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడం సంతోషం. అమరావతిలో అభివృద్ధి జరుగుతుందని నేనూ నమ్ముతున్నా. అయితే, హైదరాబాద్‌కు ఉండే అడ్వాంటేజెస్ వేరు’ అని మంత్రి పొంగులేటి అన్నారు.


ల్యాండ్ రిజిస్ట్రేషన్, అపార్ట్‌మెంట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలకు సంబంధించి సంస్థల ప్రతినిధులు పలు సూచనలు చేశారని, వారి సూచనల్లో వాస్తవికత ఉందని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా అన్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన సంస్థల ప్రతినిధులకు త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వారి సూచనలు తీసుకొని మరిన్ని చర్యలు చేపడతామని చెప్పారు. కస్టమర్ల కోసం కూడా తమ ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.


రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం ఇప్పటికే చర్యలు వేగవంతం చేసిందని మంత్రి పొంగులేటి ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుతో మరిన్ని ప్రాంతాలు పారిశ్రామికంగా, అర్థికంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విస్తరణకు సంబంధించి భవిష్యత్ ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.


అపర్ణ కన్‌స్ట్రక్షన్ సమర్పించు ‘టైమ్స్ హోమ్ హంట్ ఎక్స్‌పో’కు ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ బ్యాంకింగ్ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. మై హోం కన్‌స్ట్రక్షన్స్ ‘పవర్డ్ బై‘గా, రాఘవా కన్‌స్ట్రక్షన్స్ ‘స్పాన్సర్స్‌’‌గా వ్యవహరిస్తోన్న ఈ ఎక్స్‌పో.. జూన్ 15, 16 తేదీల్లో హైటెక్స్‌ ఎగ్జిబిషన్ సెంటర్‌లోని హాల్-3లో జరుగుతోంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఎక్స్‌పో జరుగనుంది. ఏ ప్రాంతంలో ఇల్లు కొనుగోలు చేయాలి? ఏ బ్యాంకులో ఎలా రుణాలు పొందాలి? అనే విషయాల్లో వినియోగదారులకు ఉండే అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు, మంచి ఇల్లు కొనడంలో సాయం చేసేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa