తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలు ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ జిల్లాల సంఖ్య 10 ఉండగా.. ఆ తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా జిల్లాలను ఏర్పాటు చేశారు. అయితే కొన్ని జిల్లాలకు స్థానికంగా ఉన్న పట్టణాల పేర్లు పెట్టగా.. మరికొన్ని జిల్లాలకు వ్యక్తులు, చారిత్రిక నేపథ్యం ఆధారంగా పేర్లు పెట్టారు. కొమురం భీం పేరిట ఆసిఫాబాద్ జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, యూదాద్రి భువనగిరి, రాజన్న సిరిస్లిల్ల ఇలా ప్రముఖ ఆలయాల పేరిట కూడా జిల్లాలను ఏర్పాటు చేశారు.
కాగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓ జిల్లా పేరు మార్చేందుకు సిద్ధమైంది. ములుగు జిల్లా పేరును 'సమ్మక్క సారలమ్మ ములుగు' జిల్లాగా మార్చేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు సర్కార్ నుంచి గెజిట్ నోటిఫికేషన్ జారీ అయ్యింది. పేరు మార్పునకు అభ్యంతరాలు, సూచనల స్వీకరణకు బుధవారం (జులై 3) ములుగు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రతిపాదనల మేరకు పబ్లిక్ నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పేరు మార్పుపై గ్రామసభల్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో లిఖిత పూర్వకంగా తమ అభిప్రాయాలను తెలియజేయాలన్నారు. వాటిని పరిశీలించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
కాగా, ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో సమ్మక్క-సారలమ్మ జాతర నిర్వహిస్తారు. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారలమ్మ జాతర. రెండేళ్లకు ఓసారి నిర్వహించే ఈ జాతరకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వస్తారు. అందుకే ఈ జిల్లాకు సమ్మక్క-సారలమ్మ ములుగు జిల్లాగా పేరు మార్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లా ప్రజల అభిప్రాయలను స్వీకరించి.. అందుకు అనుగుణంగా పేరు మార్చనున్నారు. కాగా, జనగామ జిల్లా పేరు మార్చాలని కూడా గత కొంత కాలంగా డిమాండ్ వినిపిస్తున్నాయి. ఆ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa