ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి.. సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక కామెంట్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 07:47 PM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎవర్ని నియమిస్తారనేది ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి కావటంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. ఈ మేరకు తనను ఆ బాధ్యతల నుంచి తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అదిష్ఠానానికి చెప్పారు. త్వరలోనే కొత్త అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ పదవికి చాలా మంది పోటీ పడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో పీసీసీ పదవికి డిమాండ్ పెరిగింది.


సామాజిక సమీకరణాల ఆధారంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటంతో రెడ్డి వర్గానికి ఆ పదవి దక్కదనే సంకేతాలు వినిపిస్తున్నాయి. బీసీ లేదా ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన నేతకు పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి మధు యాష్కీ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ముందు వరసలో ఉండగా.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీ కోటాలో మహబూబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.


కాగా, ఈ పోస్టు కోసం గతంలో పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గట్టిగా ప్రయత్నించారు. అయితే సామాజిక సమీకరణాల్లో రెడ్డి వర్గానికి ఈ పదవి దక్కకపోవచ్చుననే సంకేతాలతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో పీసీసీ పదవిపై కీలక కామెంట్స్ చేశారు. వచ్చే పదేళ్లలో ఏదో ఒకరోజు తాను తప్పకుండా పీసీసీ పదవి చేపడాతనని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సీఎం కూడా అవుతానని కీలక కామెంట్స్ చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పిన మాటలను తాను ఫాలో అవుతానని చెప్పుకొచ్చారు.


తాను సేవలను ప్రజలు మర్చిపోయారని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే పదవి కోసం తాను అడుక్కోనని.. అలా అడుక్కునే పదవి తనకు వద్దే వద్దని తేల్చి చెప్పారు. తాను ఎలాంటి పదవి లేకున్నా బతుకుతానని స్పష్టం చేశారు. ఓట్ల కోసం తాను సేవ చేయనని.. అధికారంలో ఉన్నా.. లేకున్నా తనకు ప్రజలే ముఖ్యమని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే.. తాను ప్రజలకు ఎలాంటి సేవ చేయలేదని తప్పుడు ప్రచారం చేశారన్నారు. అది చూసి తనకు బాధేసిందని జగ్గారెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పని చేస్తానని జగ్గారెడ్డి వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa