ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యాధునిక ప్రత్యేకతలతో 10.8 కి.మీ.ఫ్లైఓవర్.. ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలు తీరినట్టే

national |  Suryaa Desk  | Published : Fri, Dec 26, 2025, 09:08 PM

దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో ట్రాఫిక్ చక్రవ్యూహాన్ని చేధించుకుని బయటపడటం అంత సులువు కాదు. ఇరుకైన రోడ్లు, సామర్థ్యానికి మించిన వాహనాలతో బెంగళూరులో ప్రయాణం నిత్యం నరకమే. నగరంలో మౌలిక వసతులపై బయోకాన్ సీఈఓ కిరణ్ మజుందార్ షా వంటి పలువురు వ్యాపార ప్రముఖులు బాహటంగా విమర్శలు గుప్పించిన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిద్ధరామయ్య నాయకత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చర్యలను ప్రారంభించింది. ఇప్పటికే పలు ప్రాజెక్ట్‌లకు పచ్చ జెండా ఊపగా.. మరో కీలక పథకాన్ని సిద్ధూ సర్కారు సిద్ధం చేసింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్లు నిర్మాణం కూడా చేపట్టింది.


అత్యాధునిక సాంకేతికత, ప్రత్యేకతలతో 10.8 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రణాళికను రూపొందించింది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సిల్క్‌బోర్డు జంక్షన్- ఎలక్ట్రానిక్‌ సిటీ- ఓల్డ్ మద్రాసు రోడ్లను కలిపేలా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపడతారు. దేశంలోనే వాహనాల రద్దీ అధికంగా ఉండే ఈ జంక్షన్ నుంచి ఓల్డ్ మద్రాసు రోడ్డు వరకు ప్రయాణించే వాహనదారులకు చుక్కలు కనిపిస్తాయి. ఏదైనా కారణంతో వాహనాలు ఆగిపోతే ఇక అంతే సంగతులు. ఆ పద్మవ్యూహంలో గంటల తరబడి పడిగాపులు కాయాల్సిందే. అందుకే ఈ మార్గంలో వెళ్లడానికి వాహనదారులు భయపడిపోతారు.


అయితే, ప్రతిపాదిన పై వంతెన నిర్మాణంతో ఈ ఇబ్బందులకు చెక్ పడునుంది సిల్క్‌బోర్డు జంక్షన్, హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్, అగర, సర్జాపుర, బెళ్లందూరు, మారతహళ్లి, దొడ్డనెక్కుంది, మహదేవపుర, కేఆర్ పురం, భట్రహళ్లి వరకు వీటిని విస్తరించనున్నారు. తమిళనాడు సరిహద్దుల్లోని హోసూరు పట్టణం, ఐటీ, బీటీ సంస్థలు విస్తరించిన ప్రాంతాల ఉద్యోగులకు ఈ వంతెన ఎంతో ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. వీలైనంత వేగంగా టెండర్ల ప్రక్రియ ముగించి పనులు చేపట్టి, పూర్తిచేస్తామని బృహత్ బెంగళూరు నగర పాలిక అధికారులు తెలిపారు. సిల్క్‌బోర్డు జంక్షన్ నుంచి కేఆర్ పురం వరకు మెట్రో రైలు ప్రారంభంతో పాటు ఫ్లైఓవర్ వస్తే ట్రాఫిక్ అదుపులోకి వస్తుందని భావిస్తున్నారు. ఇక, కొన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ రహదారుల నిర్మాణానికి కూడా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa