ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నైజీరియాలో అమెరికా సైన్యం భీకర దాడులు.. హ్యాపీ క్రిస్మస్ అంటూ ట్రంప్ పోస్ట్!

international |  Suryaa Desk  | Published : Fri, Dec 26, 2025, 10:17 PM

నైజీరియాలో ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద స్థావరాలపై అగ్రరాజ్యం అమెరికా సైన్యం దాడులతో విరుచుకుపడింది. నైజీరియాలో క్రైస్తవుల హత్యలను ఆపాలని ఐసిస్‌ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొద్ది రోజుల్లోనే ఈ దాడులు చేపట్టడం గమనార్హం. క్రైస్తవులను దాడులను నిరోధించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్‌ సోషల్‌ వేదికగా పోస్టు పెట్టారు. వాయువ్య నైజీరియాలోని ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా తమ సైన్యం భీకర దాడులు నిర్వహించినట్టు పేర్కొన్నారు.


‘‘నైజీరియాలో ఐఎస్ ఉగ్రవాదులపై అమెరికా శక్తిమంతమైన దాడులు చేపట్టింది.. ముఖ్యంగా అమాయక క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని దారుణ హత్యలకు పాల్పడుతున్నవారిపై ఇవి జరిగాయి.. ఈ ఊచకోతలు ఆపకపోతే నరకం చూపిస్తానని గతంలోనే హెచ్చరించాను... అయినా వాటిని ఉగ్రవాదులు పెడనచెవినపెట్టి ఇప్పుడు దానికి ఫలితం అనుభవిస్తున్నారు.. రాడికల్‌ ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని సహించను’’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.


‘మన సైన్యానికి ఆ భగవంతుడు ఆశీసులు ఉండాలి.. హతమైన ఉగ్రవాదులు సహా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.. ఈ హత్యాకాండ కొనసాగితే.. మా దాడులు కూడా జరుగుతూనే ఉంటాయి..’ అని అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చారు. నైజీరియా అభ్యర్థన మేరకు దాడులు చేపట్టి, పలువురు ఉగ్రవాదులను హతమార్చినట్టు అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. కాగా, నైజీరియా అధికారుల అభ్యర్థన మేరకు (సోకోటో రాష్ట్రంలో) ఒక దాడిని నిర్వహించి, పలువురు ఐసిస్ ఉగ్రవాదులను హతమార్చినట్లు అమెరికా ఆఫ్రికా కమాండ్ ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్‌లో తెలిపింది.


పెంటగాన్ చీఫ్ పెటే హెగ్‌సెథ్ సైతం నైజీరియాలో తమ సైన్యం చర్యలు, సంసిద్ధతపై ప్రశంసలు కురిపించారు. ఈ విషయంలో నైజీరియా ప్రభుత్వ మద్దతు, సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక, అమెరికా దళాలు నైజీరియాలో ట్రంప్ ఆధ్వర్యంలో మొదటిసారిగా దాడులు చేశాయి. అక్టోబర్, నవంబర్ నెలల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నైజీరియాపై తీవ్ర విమర్శలు చేశారు. అక్కడ క్రైస్తవులు అస్తిత్వ ముప్పు ఎదుర్కొంటున్నారని, ఇది జాతి నిర్మూలనతో సమానమని ఆయన అన్నారు. నైజీరియాలో పలు సాయుధ సంఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


ఈ దాడులను కొందరు స్వాగతించినా మరికొందరు మాత్రం ఆఫ్రికాలోని అత్యధిక జనాభా కలిగిన ఈ దేశంలో మతపరమైన ఉద్రిక్తతలను పెంచుతున్నాయని భావించారు. గతంలో ఈ దేశంలో మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నైజీరియా ప్రభుత్వం, స్వతంత్ర విశ్లేషకులు దేశంలోని హింసను మతపరమైన హింసగా చిత్రీకరించడాన్ని తిరస్కరించారు.


ఐసిస్‌ అనుబంధ ఉగ్రవాదులు, బోకో హరామ్‌ తీవ్రవాద సమూహం నుంచి నైజీరియా చాలా కాలంగా ముప్పును ఎదుర్కొంటోంది. 2020లో తొలిసారిగా నైజీరియాను ప్రత్యేక ఆందోళనకర దేశాల జాబితాలో అమెరికా చేర్చింది. అక్కడ క్రైస్తవులపై జరుగుతున్న హింసను అరికట్టేలా సైనిక చర్యకు ప్రణాళిక రూపొందించాలని పెంటగాన్‌ను ఆదేశించినట్లు డొనాల్డ్ ట్రంప్ నవంబరులో ప్రకటించారు. దీనికి అనుగుణంగానే తాజా దాడులు జరగడం గమనార్హం.


నైజీరియా ఉత్తర ప్రాంతంలో ముస్లింలు, దక్షిణ ప్రాంతంలో క్రైస్తవుల ప్రాబల్యం ఎక్కువ. అయితే, ఈశాన్య ప్రాంతం గత 15 ఏళ్లుగా బోకో హరామ్ జీహాదీ గ్రూప్‌ అరాచకాలు కొనసాగుతున్నాయి. ఈ ఉగ్రవాద సంస్థ దాడుల్లో ఇప్పటి వరకూ 40 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 లక్షల మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇదే సమయంలో వాయువ్య, ఉత్తర, మధ్య ప్రాంతాల్లో ‘బండిట్స్’ అనే క్రిమినల్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఈ ముఠాలు గ్రామాల్లో దాడులు, హత్య, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa