ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశ రాజధానిని ఢిల్లీ నుంచి బెంగళూరుకు మార్చండి.., నెట్టింట డిబేట్

national |  Suryaa Desk  | Published : Fri, Dec 26, 2025, 09:13 PM

ఢిల్లీ లో పుట్టి పెరిగిన సిమృద్ధి మఖిజా అనే యువతి.. ఆ నగరం పూర్తిగా కాలుష్యమయంగా మారిపోయిందని.. సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలో మహిళలకు భద్రత లేదని విమర్శలు చేస్తూనే.. భారతదేశ రాజధానిగా బెంగళూరును చేయాలని ఆమె ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. బెంగళూరులోని స్వచ్ఛమైన గాలి.. భద్రత.. పాదచారులకు అనుకూలమైన వాతావరణం తనకు నచ్చాయని ఆమె పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సమస్యలను పరిష్కరించకుండా నగరాన్ని మార్చమనడం సరికాదని కొందరు.. ఢిల్లీ దుస్థితికి ఆమె మాటలు అద్దం పడుతున్నాయని మరికొందరు వాదిస్తున్నారు.


సిమృద్ధి మఖిజా ఇటీవల ఉద్యోగ రీత్యా ఢిల్లీ నుంచి బెంగళూరు కు మారిపోయింది. అనంతరం 2 నెలల తర్వాత తన తల్లిదండ్రులను చూడటానికి తిరిగి ఢిల్లీ వెళ్లిన సిమృద్ధి మఖిజాకు.. అక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగించాయి. ఈ క్రమంలో ఆమె ఒక వీడియోను విడుదల చేస్తూ.. బెంగళూరును దేశ రాజధానిగా ఎందుకు ప్రకటించకూడదని ప్రశ్నించింది. అయితే ఏదో సరదాకి తాను ఈ రాజధాని మార్పు విషయం చెప్పడం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ కంటే బెంగళూరు ఎందుకు బెటర్ అని చెప్పేందుకు ఆ యువతి 3 కారణాలు చెప్పింది.


ఢిల్లీకి చెందిన ఒక యువతి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. దేశ రాజధానిగా ఢిల్లీ కంటే బెంగళూరు నగరం అన్ని విధాలా అర్హతలు కలిగి ఉందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ యువతి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద డిబేట్‌కు తెరలేపారు. కొందరు ఆమెకు సపోర్ట్‌గా కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు.


 శుభ్రమైన గాలి


ఢిల్లీలోని కాలుష్యం ఒక గ్యాస్ చాంబర్‌లా మారిందని ఆమె విమర్శలు చేసింది. బెంగళూరులో గాలి నాణ్యత చాలా మెరుగ్గా ఉందని.. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేదని పేర్కొంది.


మహిళల భద్రత


రాత్రి 10 గంటల సమయంలో కూడా బెంగళూరు వీధుల్లో తాను ఒంటరిగా నడవగలనని.. అక్కడ మహిళల రక్షణ విషయంలో భయం లేదని ఆమె చెప్పుకొచ్చింది. ఢిల్లీతో పోలిస్తే బెంగళూరు వీధులు సురక్షితమని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.


మెరుగైన మౌలిక వసతులు


అంతర్జాతీయ అతిథులు మన దేశానికి వచ్చినప్పుడు వారికి కాలుష్యం.. నడవడానికి వీలులేని రోడ్లను చూపించడం కంటే.. బెంగళూరు వంటి మెరుగైన నగరానికి ఆహ్వానించడం చాలా గౌరవంగా ఉంటుందని ఆమె వ్యాఖ్యానించింది.


నెటిజన్ల రియాక్షన్


ఇక సిమృద్ధి మఖిజా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక నగరం పాడైపోయినప్పుడు దాన్ని బాగు చేయమని అడగాలి కానీ.. రాజధానిని మార్చాలి అనడం తెలివైన పని కాదని ఒక నెటిజన్ విమర్శించారు. బహుశా ఆమె బెంగళూరులోని ట్రాఫిక్ జామ్‌లు, ప్రాణాంతకమైన గుంతలను చూడలేదనుకుంటా అని కొందరు బెంగళూరు వాసులు సెటైర్లు వేశారు. ఢిల్లీ కాలుష్యంపై ఆమె చేసిన వ్యాఖ్యలు వాస్తవమేనని మరికొందరు నెటిజన్లు మద్దతు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa