ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రైతురాజ్యంలో నాకు అన్యాయం జరిగింది'.. ఆవేదనతో అన్నదాత సెల్ఫీ సూసైడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 07:44 PM

"రైతురాజ్యం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు అన్యాయం జరిగింది.. సీఎం, డిప్యూటీ సీఎంలే నా కుటుంబానికి న్యాయం చేయాలి.." అంటూ ఓ అన్నదాత సెల్ఫీ వీడియోలో తన ఆవేదన అంతా వెళ్లగక్కుతూ ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన ఖమ్మం  జిల్లాలో చోచేసుకుంది. చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు భోజడ్ల ప్రభాకర్‌కు.. కొంత వ్యవసాయ భూమి ఉంది. అయితే.. ఆ పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారంటూ.. ఎమ్మార్వోతో పాటు ఎస్ఐకి ఇతర అధికారులకు ప్రభాకర్ ఫిర్యాదు చేశాడు. కానీ.. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రభాకర్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.


తన పొలాన్ని వారి నుంచి కాపాడుకోలేకపోతున్నాననే బాధతో కన్నీరుమున్నీరయ్యాడు. తన బతుకుదెరువు అయిన పొలం చేజారిపోతుందని మనస్తాపానికి లోనయ్యాడు. తనకు ఆత్మహత్యే శరణ్యమన్న నిర్ణయానికి వచ్చిన.. ప్రభాకర్ పురుగుల మందు తాగుతూ.. ఓ సెల్ఫీ వీడియో చేశాడు. ఆ వీడియోలో.. "రైతు రాజ్యంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు అన్యాయం జరిగింది.. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించి తన కుటుంబానికి న్యాయం చేయాలి.." అంటూ ఆ వీడియోలో తన గోడును వెల్లబోసుకున్నాడు.


ఈ క్రమంలోనే.. పురుగుల మందు తాగి రైతు ప్రభాకర్ పొలంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇలాఖాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో రైతు ప్రభాకర్ సెల్ఫీ వీడియో వైరల్ అవుతుండటంతో.. ప్రతిపక్ష నేతలు కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ సెల్పీ సూసైడ్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో అన్నదాతల దయనీయ స్థితి ఇదీ అని.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చి అతిపెద్ద మార్పు ఇది.. అంటూ ప్రభాకర్ సెల్ఫీ వీడియోను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.


మరోవైపు.. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. "చివరికి పేద రైతులను విషం తాగే స్థాయికి దిగజార్చారు కాంగీయులు. ఇలాంటి దౌర్జన్యాలు ప్రతి చోటా జరుగుతున్నాయి. చింతకానిలో ఇది బయట పడ్డది. అన్ని ఆధారాలతో ఏ అధికారి దగ్గరికి పోయి ఫిర్యాదు చేసినా ఒకటే సమాధానం "చూస్తం.. చేస్తం.. నువ్వు ఇంటికి పో.." కనీసం ఫిర్యాదుకు తీసుకున్నట్టుగా రసీదు ఇస్తలేరు.. రైతన్న లారా, దయచేసి మీ విలువైన ప్రాణాలు తీసుకోకండి. మీకు అన్యాయం జరిగితే వెంటనే స్థానిక బీఆర్‌ఎస్ నేతలను సంప్రదించండి. వారు మీకోసం పోరాడతారు. రైతన్నల ప్రయోజనాలను గుండెలో పెట్టుకొని కాపాడిన చరిత్ర కేసీఆర్‌ది." అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa