రాష్ట్రంలోని విద్యార్థులకు ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీపికబురు వినిపించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలలో చదివే బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు (స్కాలర్షిప్) మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలలో చదివే బీసీ సామాజికవర్గాలకు చెందిన విద్యార్థులకు రూ.90.50 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పీఎం యశస్వి పథకం కింద ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు మంత్రి సవిత వెల్లడించారు. అర్హులైన బీసీ, ఈబీసీ, డీఎన్టీ విద్యార్థులకు ఈ స్కాలర్షిప్స్ అందించనున్నట్లు మంత్రి వివరించారు. అలాగే బీసీ వసతి గృహాలు, గురుకులాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.
మరోవైపు2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్ట్ మెట్రిక్ రెండో విడతకు రూ.69.40 కోట్లు, ప్రీ మెట్రిక్ రెండో విడత స్కాలర్ షిప్స్ కోసం రూ.21.10 కోట్లు నిధులు కేటాయించినట్లు మంత్రి సవిత వివరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థుల చదువుకు దూరం కాకూడదనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి సవిత వెల్లడించారు.
పీఎం యశస్వి పథకం..
PM యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రంట్ ఇండియా (PM-YASASVI) కింద.. దేశంలోని ఓబీసీ, ఈబీసీ, డీఎన్టీ (డీనోటిఫైడ్, సంచార తెగలు) సామాజిక వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. గుర్తింపు పొందిన పాఠశాలలు, కాలేజీల్లో 9, 10 వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రూ.75 వేల వరకూ ప్రోత్సాహకంగా అందిస్తోంది. అలాగే 11, 12 తరగతి చదువుకున్న విద్యార్థులకు రూ.1,25,000 వరకు ప్రోత్సాహకంగా స్కాలర్ షిప్స్ అందిస్తోంది.
అయితే ఇందుకు కుటుంబ వార్షికాదాయం రెండున్నర లక్షల లోపు ఉండాలి. ఒక కుటుంబంలో ఇద్దరిక మించి ఇవ్వరు. ఇందులో 30 శాతం బాలికలకు ఇస్తారు. పీఎం యశస్వి పథకం కింద ఒకసారి ఎంపికైన విద్యార్థులకు.. వారి ప్రతిభ మేరకు, పునరుద్ధరణ ఆధారంగా కోర్సు ముగిసేవరకు ఈ ఉపకార వేతనం అందుతుంది. అలాగే విద్యార్థి ఫెయిల్ అయితే, ఒకవేళ మరుసటి సెమిస్టర్కు ప్రమోట్ కాకపోతే.. ఈ సాయం నిలిపివేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa