ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు.. ఇక పూర్తిగా ఉచితం.. మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 26, 2025, 07:53 PM

ఆర్టీసీ బస్సులలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగులకు ఏడు వరాలు ప్రకటించిన చంద్రబాబు.. ఈ క్రమంలోనే మహిళలతో పాటుగా దివ్యాంగులకు కూడా బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో దివ్యాంగులకు ఉచిత బస్సు పథకంపై కీలక అప్ డేట్ వచ్చింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి దీనిపై కీలక వివరాలు వెల్లడించారు.


చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ఈ ప్రతిపాదనలను ఇప్పటికే సంబంధిత శాఖ వద్దకు పంపించామని వెల్లడించారు. దివ్యాంగులు ప్రస్తుతం ఆర్టీసీ బస్సులలో 50 శాతం రాయితీ పొందుతున్నారని.. ఈ విధానం అమల్లోకి వస్తే పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చని వివరించారు.


మరోవైపు దివ్యాంగులకు ఉచిత బస్సు పథకం వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. రాష్ట్రంలోని సుమారు 7 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరనుంది. దివ్యాంగులలో పాసులు ఉన్నవారు బస్సులలో ఇప్పటి వరకూ 50 శాతం రాయితీ పొందుతుండగా.. ఈ విధానం అమల్లోకి వస్తే.. ఇకపై పూర్తిగా ఉచితంగా ప్రయాణించే సౌలభ్యం ఉంటుంది. సీఎం ప్రకటన నేపథ్యంలో.. ఆర్టీసీ అధికారులు లెక్కలు తీసే పనిలో ఉన్నారు. దివ్యాంగుల పాస్‌లు ఎంతమంది పొందారు.. ఆర్టీసీకి రాయితీ రూపంలో ఎంత చెల్లించాలనే వివరాలను సిద్ధం చేస్తున్నారు.


ఏపీలో సుమారుగా 2 లక్షల మంది దివ్యాంగుల పాస్‌లు కలిగి ఉన్నారు. వీరికి బస్సులలో 50 శాతం రాయితీ వర్తిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.188 కోట్లు ఖర్చు చేస్తోంది. అయితే ఇందులో మహిళలకు ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు దివ్యాంగులైన మగవారికి కూడా ఉచితంగా ప్రయాణించే సదుపాయం అందుబాటులోకి రానుంది.


మరోవైపు ఏపీలో దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారు ఏడున్నర లక్షల మంది ఉండగా.. కేవలం 2 లక్షల మంది వరకే పాసులు తీసుకుంటున్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు పథకం అమల్లోకి వస్తే.. ఈ పాసులు తీసుకునేవారి సంఖ్య పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు లెక్కలు కడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa