ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగరుబత్తీల తయారీలో కీలక మార్పులు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 26, 2025, 07:58 PM

దేశంలో అగరుబత్తీల  నాణ్యత, భద్రతను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల ఆరోగ్యం, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్  కొత్త ప్రమాణాలను విడుదల చేసింది. 'జాతీయ వినియోగదారుల దినోత్సవం 2025' సందర్భంగా శుక్రవారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి "ఐఎస్ 19412:2025 – అగరుబత్తీల స్పెసిఫికేషన్" పేరుతో ఈ నూతన ప్రమాణాలను ఆవిష్కరించారు.ఈ కొత్త నిబంధనల ప్రకారం, అగరుబత్తీల తయారీలో పలు హానికరమైన పురుగుమందులు, సింథటిక్ సువాసనల వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. అలత్రిన్, పెర్మెత్రిన్, సైపర్‌మెత్రిన్, డెల్టామెత్రిన్, ఫిప్రోనిల్ వంటి పురుగుమందులతో పాటు బెంజైల్ సైనైడ్, ఇథైల్ అక్రిలేట్ వంటి రసాయనాల వాడకంపై ఆంక్షలు విధించారు. వీటిలో చాలా రసాయనాలు మానవ ఆరోగ్యం, గాలి నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపుతాయని అంతర్జాతీయంగా నిషేధంలో ఉన్నాయి.ప్రపంచంలోనే అగరుబత్తీల ఉత్పత్తి, ఎగుమతుల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. దేశంలో ఏటా రూ. 8,000 కోట్ల పరిశ్రమ ఉండగా, సుమారు 150 దేశాలకు రూ. 1,200 కోట్ల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఈ రంగం గ్రామీణ ప్రాంతాల్లోని ఎందరో చేతివృత్తుల వారికి, మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.కొత్త ప్రమాణాల ప్రకారం అగరుబత్తీలను యంత్ర నిర్మిత, చేతితో తయారు చేసినవి, సాంప్రదాయ మసాలా రకాలుగా వర్గీకరించారు. ముడిసరుకులు, మండే విధానం, సువాసన వంటి అంశాల్లో నాణ్యతను నిర్దేశించారు. ఈ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఉత్పత్తులకు 'బీఐఎస్ స్టాండర్డ్ మార్క్' లభిస్తుంది. దీనివల్ల వినియోగదారులు నాణ్యమైన, సురక్షితమైన ఉత్పత్తులను సులభంగా గుర్తించవచ్చని ప్రభుత్వం తెలిపింది. ఈ నిర్ణయం వినియోగదారుల నమ్మకాన్ని పెంచడంతో పాటు, భారత అగరుబత్తీలకు అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత ఆదరణ లభిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa