సాధారణంగా చిన్న పిల్లలు ప్రతి వస్తువుతోనూ ఆడుకునేందుకు ట్రై చేస్తారు. వాటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉంటుందో తెలియకుండా ప్రతి దాన్ని ఆట వస్తువుగానే చూస్తుంటారు. ఇక తల్లిదండ్రులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పదునైన వస్తువులను పిల్లలకు దగ్గరగా ఉంచుతారు. వాటి వల్ల చిన్న పిల్లలు ప్రమాదానికి గురవుతారు. కొన్నిసార్లు పెన్నులు కూడా పిల్లలను తీవ్రంగా గాయపరుస్తూ ఉంటాయి. చిన్న వస్తువులే కదా అని అనిపించినా.. వాటి వల్ల ప్రాణాలు పోయే పరిస్థితులు తలెత్తుతాయి. తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటువంటి ఘటనే చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పెన్ను ఓ బాలిక తలలో గుచ్చుకుంది. దీంతో చిన్నారి నొప్పితో విలవిల్లాడిపోయింది.
వివరాల్లోకి వెళితే.. భద్రాచలం పట్టణంలోని సుభాశ్నగరకు చెందిన నాలుగేళ్ల చిన్నారి రియాంచిన పెన్నుతో ఆడుకుంటుంది. ఇంట్లో మంచంపై కూర్చుని పెన్నుతో ఆడుకుంటూ పుస్తకంలో రాసుకుంటుంది. ఈ క్రమంలో మంచంపై నుంచి ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ క్రమంలో చిన్నారి చేతిలోని పెన్ను చెవి పైభాగంలో బలంగా గుచ్చుకుంది. దాదాపు పెన్ను సగం వరకు తలలోకి దూసుకెళ్లింది. దీంతో చిన్నారికి తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
అనంతరం అక్కడి నుంచి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు హాస్పిటల్కి చిన్నారిని తీసుకెళ్లారు. అక్కడ న్యూరోసర్జన్ అందుబాటులో లేకపోవడంతో వెంటనే ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ సర్జరీ నిర్వహించి పాప తలలోని పెన్నును బయటకు తీశారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. చిన్న పిల్లలకు దగ్గర్లో పదునైన వస్తువులు ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. వారు ఆడుకుంటున్న సమయంలోనూ వారిపై ఓ కన్నేసి ఉంచాలని అంటున్నారు. తెలిసీ తెలియక ప్రతి వస్తువుతోనూ ఆడుకునేందుకు ప్రయత్నిస్తారని.. దాని వల్ల కొన్ని సార్లు వారు ప్రమాదాల బారిన పడతారని చెబుతున్నారు. స్క్రూ డైవర్లు, కత్తులు, మేకులు వంటి పదునైన వస్తువులు చిన్న పిల్లలకు దగ్గరగా ఉండకుండా చూడాలని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa