ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కానిస్టేబుళ్లతో గొడవ.. ఎస్సై ఆత్మహత్యాయత్నం..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 02, 2024, 08:01 PM

కిందిస్థాయి సిబ్బందితో గొడవల కారణంగా ఓ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగి చనిపోయేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న తోటి సిబ్బంది ఎస్సైని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం అతడికి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.


వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నారక్కపేటకు చెందిన శ్రీరాముల శ్రీనివాస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఆదివారం (జూన్ 30) ఉదయం కొత్త చట్టాలపై స్టేషన్ సిబ్బందికి ఎస్సై శ్రీనివాస్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన తన సొంత కారులో స్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోయారు. కాసేపటికి ఎస్సై ఫోన్‌కు స్టేషన్ సిబ్బంది ఫోన్ చేయగా.. రెండు ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. దీంతో కంగారుపడిన స్టేషన్ సిబ్బంది సీఐ జితేందర్ రెడ్డికి విషయం చేరవేశారు. ఆయన వెంటనే ఎస్పీ రోహిత్ రాజ్‌కు సమాచారం అందించారు.


ఎస్సై మిస్ అయినట్లు భావించిన పోలీసులు ప్రత్యేక బృందాలను బరిలోకి దించారు. ఆయన కారు మహబూబాబాద్ జిల్లా కేంద్రం వైపు వెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో ఎస్సై తన ఫోన్ ఆన్ చేశారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో తాను పురుగుల మందు తాగానని 108 సిబ్బందికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్లిన అంబులెన్స్ సిబ్బంది ఎస్సైను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు.


అయితే ఎస్సై ఆత్మహత్యాయత్నానికి తోటి సిబ్బందితో గొడవలే కారణంగా తెలుస్తోంది. గత కొంత కాలంగా ఎస్సై శ్రీనివాస్‌పై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. స్టేషన్ పరిధిలో ఇసుక మాఫియా, పేకాట స్థావరాలు, ఇల్లీగల్ దందాలపై ఫోకస్ పెట్టిన ఎస్సై.. భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. అయితే డబ్బు పంపకాల విషయంలో స్టేషన్ సిబ్బందికి ఎస్సైకి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు తెలిసింది. ఎస్సై తమ వాటా డబ్బులు ఇవ్వకపోవటంతో స్టేషన్‌లో జరిగే ప్రతి విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. దానికి తోడు సిబ్బంది ఎస్సైకి సపోర్టు చేయకుండా సహాయ నిరాకరణకు దిగినట్లు సమాచారం.


మెుత్తంగా గత నాలుగు నెలల్లోనే ఎస్సై శ్రీనివాస్‌కు నాలుగు మెమోలు జారీ అయినట్లు తెలిసింది. ఎస్పీ రోహిత్ రాజ్ సైతం ఇటీవల ఎస్సైని తీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో మనస్థాపం చెందిన ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa