కూతురు సాక్ష్యం చెప్పటంతో హత్య కేసులో జైలు పాలైన ఓ తండ్రి.. 14 ఏళ్లు శిక్ష అనుభవించాడు. అనంతరం శిక్షా కాలం పూర్తి కావటంతో తిరిగి కూతురు చెంతకు చేరుకున్నాడు. భావోద్వేగంతో కూడిన ఈ సన్నివేశం కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన సారయ్య 2010లో తన భార్య సత్తమ్మతో గొడవపడి ఆమెను చంపేశాడు. ఈ హత్యకు వారి ఐదేళ్ల కుమార్తె పూజ ప్రత్యక్ష సాక్షి. కేసు విచారణలో భాగంగా కూతురు సాక్ష్యం ఆధారంగా సారయ్యను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అతడికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది.దీంతో సారయ్య 2010లో జైలు పాలయ్యాడు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు. శుక్రవారం ( జులై 5) శిక్షా కాలం పూర్తి కావటంతో హైదరాబాద్ నుంచి స్వగ్రామం చేరుకున్నాడు. తన కుమార్తె పూజ (19), కుమారుడు బన్నీ (18)లను హత్తుకొని భావోద్వేగానికి గురయ్యాడు. తన తండ్రి జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చినందుకు సంతోషంగా ఉందని.. కుమారుడు బన్నీ అన్నారు. ఇక నుంచి తాము అనాథలం కామని.. తండ్రితో కలిసి జీవిస్తామని చెప్పారు.
తన జీవితం ఇతరులకు పాఠం కావాలని సారయ్య వెల్లడించారు. ఆవేశంలో తాను చేయకూడని పని చేసానని పశ్చాతాపం చేందాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండవచ్చు కానీ హింసకు ఆస్కారం ఉండకూడదని అన్నారు. తాను చేసిన పనికి సారయ్య విచారం వ్యక్తం చేశాడు. అయితే సారయ్య అరెస్టు కాగానే.. తన ఇద్దరు పిల్లలను జమ్మికుంటలో స్పందన అనాథ శరణాలయంలో అప్పగించారు. అక్కడ గోపరాజు వీరాస్వామి సంరక్షణలో పిల్లలిద్దరూ చదువుకున్నారు.
శుక్రవారం వీర స్వామి దంపతులు పూజ, బన్నీలను తండ్రి సారయ్యకు అప్పగించి వారు కూడా భావోద్వానికి గురయ్యారు. తమ సంరక్షణలో పెరిగిన ఇద్దరు పిల్లలు వెళ్లిపోతున్నందుకు బాధగా ఉందని.. అదే సమయంలో వారిని తండ్రి వద్దకు చేర్చినందుకు సంతోషంగా ఉందని వీరస్వామి వెల్లడించారు. చాలా ఏళ్లుగా వారు తమ కుటుంబంలో భాగమయ్యారని చెప్పారు. కాగా, పూజ అనాథశ్రమంలోనే ఉండి పై చదువులు చదవగా.. లాయర్ అయ్యేందుకు కావాల్సిన కోర్సు చేస్తోంది. ఇక బన్నీ ఇంటర్ పూర్తి చేయగా.. ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa