తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు ఆసక్తిని రేకిత్తిస్తున్నాయి. ఓవైపు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ గూటికి చేరుతుండగా.. ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు పదవుల కోసం పోటీ పడుతున్నారు. అందుకోసం పార్టీ అధిష్ఠానాలతో మంతనాలు, రెకమెండేషన్లు, కార్యకర్తలతో డిమాండ్లు చేపించడాలు నడుస్తున్న క్రమంలోనే.. తాము కూడా బహిరంగంగానే తమ మనసులోని కోరికలను బయటపెట్టేస్తున్నారు. మీడియా ద్వారా నాయకత్వంపై ఒత్తిడి పెట్టేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.రేవంత్ రెడ్డి సర్కారు కేబినెట్ విస్తరణ చేయాలని యోచిస్తున్న వేళ.. నేతలు తమ మనసులోని కోరికలను బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే.. తాను కూడా మంత్రి పదవి ఆశిస్తున్నట్టుగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన బీర్ల ఐలయ్య.. సీఎం రేవంత్ రెడ్డికి తన మనసులో మాట చెప్పానని.. అందుకు ఆయన కూడా సానుకూలంగానే స్పందించారంటూ ఐలయ్య చెప్పుకొచ్చారు. గొల్లకుర్మలకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మిగతా మంత్రులను కూడా కలిశామని తెలిపారు.
నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇప్పటికే.. మంత్రి పదవులున్నాయని.. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఒక్కరికీ కూడా మంత్రి పదవి లేదని ఐలయ్య చెప్పుకొచ్చారు. భువనగిరి పరిధిలో తనకు అవకాశం కల్పించాలని కోరినట్టు తెలిపారు. ఇప్పటివరకు.. ఎన్నడూ గొల్లకుర్మలు లేకుండా మంత్రి వర్గం లేదన్న విషయాన్ని ఐలయ్య గుర్తు చేశారు. గొల్లకుర్మల ప్రతినిధిగా తనకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.
పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో తమ వర్గంలో నుంచి ముగ్గురికి మంత్రి వర్గంలో అవకాశం ఇచ్చారని ఐలయ్య వివరించారు. 50 లక్షల పైచిలుకు జనాభా వున్న గొల్లకుర్మలకు ప్రభుత్వంలో పదవులు ఇవ్వటమనేది అనివార్యమంటూ చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరొచ్చినా తమ పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు. తనకు సీఎం రేవంత్ రెడ్డిపై పూర్తి నమ్మకం ఉందని.. కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని బీర్ల ఐలయ్య చెప్పుకొచ్చారు. అయితే.. బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలంటూ.. ఆయన నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు పలు సందర్భాల్లో తమ డిమాండ్ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నియోజకవర్గంతో పాటు.. గాంధీ భవన్ వద్ద కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. తమ డిమాండ్ను నాయకత్వానికి చేరేలా పలు ప్రయత్నాలు కూడా చేయటం గమనార్హం.
కేబినెట్ విస్తరణతో పాటు టీపీసీసీకి కూడా కొత్త అధ్యక్షుడిని నియమించే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. ఈ పదవి కోసం కూడా సీనియర్ నేతలతో పాటు యంగ్ లీడర్లు కూడా పోటీ పడుతున్నారు. తాము పార్టీకి ఎంతో సేవ చేస్తున్నామని.. తమకు కూడా ఓ అవకాశం ఇచ్చి చూడాలంటూ.. నేతలు అధిష్ఠానం వద్ద మొరపెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి.. ఈ కేబినెట్ విస్తరణలో ఎవరెవరికి ఛాన్స్ వస్తుంది.. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరికి బాధ్యతలు కట్టబెడతారన్నది కొన్ని రోజుల్లో అన్ని బయటపడనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa