ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు ఈ పథకం వర్తింపు, వైద్య ఖర్చులకు 4 లక్షలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 21, 2024, 10:08 PM

పదవీ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు, స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు కూడా.. రిటైర్డ్ ఎంప్లాయిస్ మెడిక‌ల్ ఫెసిలిటీ స్కీం కింద ల‌భించే ప్రయోజ‌నాల‌ను టీజీఎస్ ఆర్టీసీ సంస్థ వర్తింపజేసింది. గ‌తంలో ఉన్న నిబంధ‌న‌ల్లో పలు మార్పులు చేస్తూ కొత్త స‌ర్కుల‌ర్‌ను సంస్థ జారీ చేసింది. ఈ మేర‌కు మార్పులు చేసిన స‌ర్క్యూల‌ర్‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాక‌ర్ విడుద‌ల చేశారు. మెడిక‌ల్ కారణాలతో రిటైర్డ్ అయిన సిబ్బందితో పాటు కారుణ్య ఉపాధి పొంద‌ని బాధిత జీవిత భాగ‌స్వాములూ ఈ స్కీం స‌భ్యత్వాన్ని పొంది ప్రయోజ‌నాల‌ను పొందనున్నారు. సీలింగ్ ప్రకారం స‌భ్యత్వం పొందిన ల‌బ్దిదారులు జీవిత కాలం వ‌ర‌కు వైద్య ఖ‌ర్చుల‌కు రూ.4 ల‌క్షల వ‌ర‌కు వినియోగించుకునే స‌దుపాయాన్ని టీజీఎస్ ఆర్టీసీ సంస్థ కల్పించింది.


మరోవైపు.. హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన మాట్లాడారు. తార్నక ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్యులతో మంత్రి సమావేశమయ్యారు. సిబ్బందికి అందిస్తోన్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ సిబ్బందికి వైద్య సేవల విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని, తమ కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ వైద్య సేవలను అందించాలని డాక్టర్లకు సూచించారు. తార్నక ఆస్పత్రి ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని సదుపాయాలను ఆర్టీసీ సిబ్బంది వినియోగించుకోవాలన్నారు.


ఇదిలా ఉంటే.. మహాలక్ష్మి పథకాన్ని ఉపయోగించుకుని ఇప్పటివరకు రూ.2350 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని.. జీవో ప్రకారం రీయంబర్స్ కింద ఇప్పటివరకు రూ.1740 కోట్ల నిధులను సంస్థకు ప్రభుత్వం విడుదల చేసిందని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రతి రోజు సగటున 30 లక్షల మంది మహిళలను సంస్థ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతోందని వివరించారు. సిబ్బంది కష్టపడి చేయడం వల్ల త్వరలోనే టీజీఎస్ ఆర్టీసీ రూ.8500 కోట్ల టర్నోవర్ కార్పొరేషన్గా అవతరించబోతుందని తెలిపారు. ప్రస్తుతం దేశానికి రోల్ మోడల్గా టీజీఎస్ ఆర్టీసీ సంస్థ నిలిచిందని సజ్జనార్ వివరించారు. మరోవైపు.. ఆర్టీసీ సిబ్బంది ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ సంస్థ మార్చిందని తెలిపారు. ప్రస్తుతం ప్రతి రోజు 1500 మంది ఉద్యోగులు ఓపీ సేవలను వినియోగించుకుంటున్నారని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa