ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడ్జెట్‌ స్పీచ్‌లో తెలంగాణ పేరు కూడా ప్రస్తావించని కేంద్రం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 23, 2024, 07:44 PM

2024-25 సంవత్సరానికి గానూ పూర్తి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. అయితే.. ఈ బడ్జెట్‌లో తెలంగాణకు ఎప్పటిలాగే నరేంద్ర మోదీ సర్కారు మళ్లీ మొండిచెయ్యే చూపించింది. శుష్కప్రియాలు, శూన్య హస్తాలు.. అంటూ మాజీ సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్పే డైలాగ్ మాదిరిగానే తెలంగాణకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయి. పక్కనున్న తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై వరాల జల్లు కురిపించిన కేంద్రం.. బడ్జెట్ స్పీచ్ మొత్తంలో కనీసం ఒక్కసారంటే ఒక్కసారి కూడా తెలంగాణ పేరు ప్రస్తావించకపోవటం శోచనీయం. గతంలో.. కేసీఆర్ ప్రభుత్వం, మోదీ సర్కార్‌తో సఖ్యంగా లేకపోవటం వల్లే.. తెలంగాణపై కేంద్రం శీతకన్ను వేసిందని భావించగా.. ఇప్పుడు కేంద్రంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సఖ్యంగా ఉన్నా.. అదే వైఖరి పాటించటం గమనార్హం.


 కేంద్ర బడ్జెట్‌ చూసిన తర్వాత.. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాటజీ ఫెయిల్ అయ్యినట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో తమ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ.. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రి బృందంతో.. ప్రధాన మంత్రి మోదీని కలిశారు. కేంద్ర మంత్రులను కూడా ఇప్పటికే పలుమార్లు కలిసి.. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తులు చేశారు. గతంలో మోదీ సర్కారుతో కేసీఆర్ విభేదించటం, విమర్శించటం వల్లే రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని.. పార్టీలుగా ప్రత్యర్థులైనప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుగా సత్సంబంధాలు కొనసాగించటం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని రేవంత్ సర్కార్ భావించింది.


ఈ మేరకే.. గతంలోనూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అవసరాలపై మోదీని కలిసి వినతి పత్రం సమర్పించగా.. బడ్జెట్‌కు ముందు కూడా కేంద్ర మంత్రులను మళ్లీ కలిసి మరోసారి తమ విజ్ఞప్తులు చేశారు. ఈక్రమంలోనే.. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరీ, జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న 500కే గ్యాస్ సిలిండర్‌ పథకానికి, మూసీ ప్రక్షాళనతో పాటు జల్ జీవన్ మిషన్‌కు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కానీ.. బడ్జెట్‌లో కనీసం తెలంగాణ పేరును కూడా ప్రస్తావించకపోవటంతో ఆ స్ట్రాటజీ ఫెయిల్ అయినట్టయింది. ఫలితంగా కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలను పూర్తిగా నిరాశపర్చింది.


ఇదిలా ఉంటే.. ప్రక్కనే ఉన్న ఏపీకి మాత్రం.. రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు సాయం సర్దుబాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. పోలవరం సత్వర నిర్మాణానికి సాయం అందిస్తామని.. ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. విశాఖ-చెన్నై, ఓర్వకల్లు- బెంగళూరు మధ్య ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రీ కారిడార్లకు నిధులు కేటాయిస్తామని ప్రకటించటం గమనార్హం. మరోవైపు.. తెలంగాణ నుంచి బీజేపీ తరపున 8 మంది ఎంపీలు గెలవటం.. అందులో ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నా కూడా కేంద్రం వివక్ష చూపటమనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలోనూ ఇలాగే చేసిన కేంద్రం.. ఇప్పుడు రేవంత్ సర్కారులోనూ బడ్జెట్‌లో రిక్తహస్తమే చూపించటం తెలంగాణ ప్రజలపై వివక్ష చూపటమేనని నేతలు మండిపడుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa