ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం,,,కవితకు బెయిల్, కేసీఆర్‌కు గవర్నర్ గిరి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 08:44 PM

భారతీయ జనతా పార్టీలో భారత్ రాష్ట్ర సమతి విలీనం కాబోతుందని గత కొంత కాలంగా సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం.. ఆ పార్టీ నేతలు కారు దిగి వివిధ పార్టీల్లోకి వెళ్లటం, మాజీ సీఎం కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉండటంతో వీటి నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ పార్టీని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. తమది ఉద్యమ పార్టీ అని.. అంతకన్నా ఒడుదొడుకులను ఎదుర్కొని నిలబడినట్లు చెప్పారు. తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయటంపై ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన సీఎం రేవంత్.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరుగుతుందని జోశ్యం చెప్పారు. అందుకు ప్రతిఫలంగా మాజీ సీఎం కేసీఆర్‌కు గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీష్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని చెప్పారు. కవిత జైలు నుంచి విడుదల కావటంతో పాటు ఆమె రాజ్యసభకు కూడా వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని.. వాళ్ల విలీనంతో కవితకు బెయిల్, రాజ్యసభ ఎంపీ సీటు వస్తుందన్నారు. నాలుగు రాజ్యసభ సీట్లకు సమానంగా కవితకు రాజ్యసభ సీటు వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం తథ్యమని చెప్పారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఖండించినా.. ఎప్పటికైనా అది జరగక మానదన్నారు.


ఇక ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ రానున్నట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఆ సంస్థ హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. ఇక రైతు రుణమాఫీకి రూ.5 వేల కోట్ల రిజర్వ్ నిధులు అందుబాటులో ఉంచామన్నారు. రుణమాఫీ కాని రైతులు కలెక్టరేట్‌కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వొచ్చునని చెప్పారు. ఒకే కుటుంబంలో వారికి 2 లక్షలకు పైగా రుణం ఉంటే వారిని ఒక యూనిట్‌గా పరిగణించి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. తన మార్క్ ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆగస్టు 15 వరకు రుణమాఫీ తేదీ ప్రకటించానన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించిందేమీ లేదని సీఎం రేవంత్ విమర్శించారు.


ఇక తన కుటుంబ సభ్యులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కూడా రేవంత్ స్పందించారు. తన కుటుంబ సభ్యులకు ప్రభుత్వంలో ఎటువంటి పదవులు ఇవ్వలేదని చెప్పారు. అమెరికాలో తన కుటుంబ సభ్యులు ఎన్నో ఏళ్లుగా ఉంటున్నారన్నారు. ప్రభుత్వంలో ఎటువంటి బాధ్యతలు తన సోదరులకు ఇవ్వలేదన్నారు. తనకు ఏడుగురు సోదరులని.. తాను సీఎం అయ్యానని వారు ఇంట్లో కూర్చుంటారా ? అని ప్రశ్నించారు. వారు వ్యక్తిగతంగా విదేశీ పర్యటనకు వెళ్లినా రాజకీయం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa