ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమ్మమ్మ మాట్లాడట్లేదని ఆత్మహత్య చేసుకున్న మనవరాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2024, 10:12 PM

చిన్నప్పటి నుంచి అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. ఆమెతోనే చనువు ఎక్కువ. ప్రతి విషయాన్ని అమ్మమ్మతోనే పంచుకునేది. సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్లి సరదాగా గడిపేది. అయితే ఇటీవల కాలంలో కుటుంబ సభ్యుల మనస్పర్థల కారణంగా అమ్మమ్మ మాట్లాడటం లేదు. ఇంటికి కూడా రావటం లేదు. దీంతో మనస్థాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.


 వివరాల్లోకి వెళితే.. హనుమకొండ భీమదేవరపల్లి మండల కేంద్రానికి చెందిన మార్పాటి మహేందర్‌రెడ్డికి ఒక కుమార్తె. భార్య సుమతి చెల్లెలి కుమార్తె నిఖిత (22)ను కూడా చిన్నప్పటి నుంచి మహేందర్ రెడ్డే పెంచుకున్నారు. ప్రస్తుతం నిఖిత కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుతోంది. చదువుతో పాటు మడికొండలోని ఓ ప్రైవేటు కంపెనీలో గత ఏడాది కాలంగా పార్ట్‌టైం జాబ్‌ చేస్తోంది. నిఖితకు హుజూరాబాద్‌ మండలం కేంద్రంలో ఉంటున్న అమ్మమ్మ పారుపల్లి వెంకటమ్మ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ప్రతి చిన్న విషయాన్ని అమ్మమ్మతోనే పంచుకునేది.


అయితే ఇటీవల హేందర్‌రెడ్డి కుటుంబంతో వెంకటమ్మకు మనస్పర్థలు వచ్చాయి. దీంతో వెంకటమ్మ భీమదేవరపల్లికి రావటం మానేసింది. అమ్మమ్మ ఇంటికి రాకపోగా.. తనతోనూ మాట్లాడకపోటవంతో నిఖిత కలత చెందింది. బుధవారం (ఆగస్టు 14) యూనివర్సిటికీ వెళ్లి పరీక్ష రాసొచ్చిన నిఖిత... రాత్రి 10గంటల వరకు అక్క ప్రియదర్శిని కుమారుడితో సరదాగా ఆడుకుంది. అనంతరం ఇంటి పై అంతస్తులోని గదిలోకి నిద్రించేందుకు వెళ్లింది. మర్నాడు ఉదయం 9 గంటలైనా నిఖత కిందకు రాలేదు. దీంతో తండ్రి మహేందర్‌రెడ్డి, అక్క ప్రియదర్శిని పై అంతస్తులోని గదికి వెళ్లి పిలిచారు అయినా ఆమె తలుపు తీయలేదు.


దీంతో ఆందోళనకు గురైన మహేందర్‌ రెడ్డి తన మిత్రుడు చాంద్‌పాషా సహకారంతో ఇంటి తలుపులు పగులగొట్టాడు. అక్కడ కనిపించింది చూసి షాక్‌కు గురయ్యాడు. నిఖిత ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. ఆమెను కిందకు దించి చూడగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. మహేందర్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. అమ్మమ్మపై ఇష్టంతోనే ఆమె మాట్లాడకపోయేసరికి నిఖిత ప్రాణాలు తీసుకుందని కుటుంబ సభ్యులు అంటున్నారు. కాగా, నిఖిత ఆత్మహత్యతో భీమదేవరపల్లిలో విషాదం అలుముకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa