ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.2 లక్షల వరకున్న పంట రుణాలన్నీ మాఫీ చేశాం : మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 08:47 PM

రాష్ట్రంలో రూ.2 లక్షల వరకున్న పంట రుణాలన్నీ మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 22,37,848 మంది రైతుల ఖాతాల్లో రూ.17,933.19 కోట్లు జమ చేశామన్నారు. ఏదైనా సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులు ఉంటే వారి వివరాలు సేకరించి పోర్టల్‌ లో అప్‌ లోడ్‌ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పంట సీజన్‌ లోనే రైతుల సంక్షేమానికి రూ.26,140.13 కోట్లు ఖర్చు చేశామన్నారు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన రైతుబంధు బకాయిలు, డ్రిప్‌, ఆయిల్‌ పాం రైతుల సబ్సిడీలు, కంపెనీలకు ఇవ్వాల్సిన బకాయిలను తాము విడుదల చేశామన్నారు. రాష్ట్రంలోని 35 బ్యాంకుల 3,292 శాఖలు, 909 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌)లలో 2018 డిసెంబర్‌ 12 నుంచి 2023 వరకు తీసుకున్న పంట రుణాల వివరాలు తెప్పించామని తెలిపారు. పాస్‌ బుక్‌ లు ఉండి క్రాప్‌ లోన్లు తీసుకోని ఖాతాల సంఖ్య 42 లక్షలని తెలిపారు. ఇందులో ఆధార్‌ నంబర్‌ తప్పుగా నమోదైనవి, క్రాప్‌ లోన్‌ కన్నా వడ్డీ ఎక్కువగా ఉన్న ఖాతాలు మినహా అన్ని సరిగా ఉన్న రైతులకు రుణమాఫీ వర్తింపజేశామన్నారు. 


 


రుణమాఫీకి మార్గదర్శకాలు జారీ చేసిన మూడు రోజులకే.. అంటే 2024 జూలై 18న రూ.లక్ష లోపు క్రాప్‌ లోన్‌ లు ఉన్న 11,50,193 మందికి రూ.6,098.93 కోట్లు చెల్లించామన్నారు. రెండో విడతలో రూ.1.50 లక్షల వరకు ఉన్న లోన్‌లు ఉన్న 6,49,823 మందికి రూ.6,190.01కోట్లు, మూడో విడతలో రూ.2 లక్షల మంది 4,46,832 మందికి రూ.5,644.24 కోట్లు మాఫీ చేశామన్నారు. మూడు విడతల్లో కలిపి రూ.17,933.19 కోట్లు మాఫీ చేశామని తెలిపారు. కుటుంబ నిర్దారణకు మాత్రమే రేషన్‌ కార్డ్‌ ప్రమాణికంగా తీసుకున్నామని తెలిపారు. రూ.2 లక్షల వరకు క్రాప్‌ లోన్‌ ఉండి ఏదైనా కారణాలతో రుణమాఫీ కాకుంటే వారు వ్యవసాయాధికారులను సంప్రదించాలని సూచించారు. వారు అడిగిన రికార్డులు సమర్పిస్తే వారికి కూడా రుణమాఫీ చేస్తామన్నారు. ఆధార్‌ నంబర్లు ఇవ్వకపోవడం, లోన్లు జారీ చేసిన తేదీలు తప్పుగా నమోదవడం లాంటి కారణాలతో కొందరికి రుణమాఫీ కాలేదన్నారు. మొదటి, రెండో విడతలలో తప్పులు దొర్లిన 7,925 మంది రైతుల ఖాతాల్లో రూ.44.95 కోట్లు జమ చేశామన్నారు. రూ.2 లక్షలకు పైగా క్రాప్‌ లోన్లు తీసుకున్న వారు ప్రభుత్వం మాఫీ చేసే మొత్తం పోగా మిగిలిన సొమ్ము బ్యాంకులకు జమ చేసిన తర్వాతే వారికి రుహమాఫీ వర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొందరు రాజకీయ నాయకులు తొందరపడి మాట్లాడుతున్నారని, రూ.2 లక్షల వరకు ఉన్న లోన్లు అన్నీ మాఫీ చేశామని తెలిపారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa