ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోల్‌కతా ఘటనలో తెలంగాణ తరహా న్యాయం : కేటీఆర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2024, 07:30 PM

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అత్యంత అమానుష ఘటనపై దేశమంతా ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో న్యాయం చేయాలంటూ.. వైద్య విద్యార్థులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. వైద్య విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు కూడా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. కోల్ కతా ఘటనలో తెలంగాణ తరహా న్యాయం చేయాలని.. మిగతా రాష్ట్రాల వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని గుర్తు చేసిన కేటీఆర్.. దటీజ్ కేసీఆర్ అంటూ పేర్కొన్నారు.


అయితే.. కోల్ కతా ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఢిల్లీ వైద్య విద్యార్థులు.. కేసీఆర్ చేసింది మమతా బెనర్జీ ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. దిశ కేసులో బాధితులకు కేసీఆర్ న్యాయం చేసినట్లుగానే.. కోల్‌కతా రేప్ కేసు నిందితులను కూడా ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో దిశ రేప్ కేసుకు సంబంధించి నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహరించినట్టు వెస్ట్ బెంగాల్ సీఎం మమత వ్యవహరించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఢిల్లీలో వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు. కాగా.. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కేటీఆర్.. దటీజ్ కేసీఆర్ అంటూ కొనియాడారు.


మరోవైపు.. రాఖీ రోజు తన సోదరి కవిత తనతో లేకపోవడం బాధాకరమని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఆమెకి న్యాయం లభిస్తుందని సుప్రీంకోర్టుపైన నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి సోదర సోదరీమణులకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయం అస్తవ్యస్తంగా ఉండేదని.. అగ్ని ప్రమాదం జరిగితే కూడా ఫైర్ ఇంజన్ రాని పరిస్థితి ఉండేదన్నారు.


ఇవన్నీ చూసిన తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సచివాలయ పునర్నిర్మాణం చేద్దామనుకున్నారని తెలిపారు. తెలంగాణ పౌరుషం తెలంగాణ వైభవాన్ని చాటేలా నూతన సచివాలయం నిర్మించాలనున్నారని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్‌కు అద్భుతమైన నివాళి అందించేలా మహనీయుడి అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరుని సచివాలయానికి పెట్టుకున్నామని.. సచివాలయంలో కూర్చుని పాలించే ప్రతి పాలకుడికి అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిని జ్వలింపజేస్తూ స్ఫూర్తినిచ్చేలా ఒక అద్భుతమైన అమర జ్యోతి స్మారకాన్ని నిర్మించినట్టు తెలిపారు.


తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ప్రతికైన తెలంగాణ తల్లిని అక్కడే ప్రతిష్టించాలన్న ఉద్దేశంతో ఒక ఐలాండ్ క్రియేట్ చేసినట్టు కేటీఆర్ తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లోనే అక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అమరజ్యోతి ఇప్పటిదాకా ప్రజల కోసం ప్రారంభం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీకి, రాజీవ్ గాంధీ స్టేడియం రాజీవ్ గాంధీ ఉప్పల్ స్టేడియం, రాజీవ్ రహదారి, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇలా ఎన్ని పేర్లు ఉన్నా.. వాటిని తాము ఏనాడూ మార్చటానికి ప్రయత్నం చేయలేదన్నారు. కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన తెలంగాణ తల్లిని అవమానించిన తర్వాత బాధతో ఈ మాట చెప్పాల్సి వస్తుందన్నారు.


రాహుల్ గాంధీ దగ్గర మార్కులు కొట్టేయాలి అంటే గాంధీభవన్లోనూ రేవంత్ రెడ్డి ఇంట్లోనూ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టుకోవాలన్నారు. వందలాది మంది తెలంగాణ ప్రజల ప్రాణాలు తీసిన కాంగ్రెస్ పార్టీ.. మరోసారి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కకు పెట్టి రాహుల్ గాంధీ విగ్రహాన్ని పెడుతుందని విమర్శించారు. ఢిల్లీకి గులాములుగా ఉన్న కాంగ్రెస్ నేతలకు తెలంగాణ పౌరుషం కలిగిన బిడ్డగా చెబుతున్న వాటిని మార్చే దిశగా ఆలోచన చేస్తామన్నారు కేటీఆర్.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa