ఐటీసీ షేర్ హోల్డర్లకు 2026లో బిగ్ షాక్ తగిలింది. వీరికి న్యూ ఇయర్ ఉంది కానీ హ్యాపీనే లేదు. ఈ సిగరెట్ల నుంచి ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల్ని తయారు చేసి విక్రయించే కంపెనీ షేరు ధర 2 రోజుల్లో భారీగా పతనమైంది. కిందటి రోజు 10 శాతం, జనవరి 2న దాదాపు 4 శాతం ఇలా 2 రోజుల్లో 14 శాతానికిపైగా పడిపోగా.. ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు వచ్చాయని చెప్పొచ్చు. ఈ స్టాక్ ధర మూడేళ్లలోనే కనిష్ఠ స్థాయికి పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క ప్రకటనే ఈ స్టాక్ భారీ పతనానికి కారణం. పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక్కడ పొగాకు ఉత్పత్తులు అంటే ప్రధానంగా సిగరెట్లే ఉంటాయి.
వీటిపై అదనపు ఎక్సైజ్ సుంకం సహా గతంలో ప్రకటించిన 40 శాతం జీఎస్టీ ఫిబ్రవరి 1 నుంచి అమలవుతుందని కేంద్ర ప్రభుత్వం.. తాజాగా అధికారికంగా సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఆయా సిగరెట్ తయారీ కంపెనీల లాభదాయకత, అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావించిన ఇన్వెస్టర్లు షేర్లను అమ్మేస్తున్నారు. ఇంకా పలు బ్రోకరేజీలు ఆయా స్టాక్స్ రేటింగ్స్ తగ్గించి.. టార్గెట్ ప్రైస్లో కోత విధించాయి.
ఈ క్రమంలోనే సిగరెట్ల తయారీలో ప్రధాన కంపెనీగా ఉన్నటువంటి ఐటీసీ షేరు భారీగా పడిపోయిందన్నమాట. ప్రస్తుతం ఈ స్టాక్ ధర రూ. 350 స్థాయిలో ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 491 కాగా.. కనిష్ఠ ధర ఇవాళ ఇంట్రాడేలో నమోదు చేసిన రూ. 345.25. ఈ స్టాక్ గత 5 రోజులు, నెల, 6 నెలల్లోనూ పతనమైంది. ఇక 2 రోజుల్లో ఈ స్టాక్ ధర భారీ పతనంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 72,300 కోట్లకుపైగా ఆవిరై రూ. 4.38 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే రూ. 72,300 కోట్ల మేర ఇన్వెస్టర్లు నష్టపోయారని చెప్పొచ్చు.
ఇక్కడ నష్టపోయిన వారిలో ఇన్వెస్టర్లే కాదు.. దేశీయ సంస్థాగత మదుపరులు (DII) కూడా నష్టపోయారు. ఇవి కూడా ఆయా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఈ క్రమంలోనే దేశంలోనే అతిపెద్ద డీఐఐగా ఉన్న.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కూడా ఐటీసీలో ఇన్వెస్ట్ చేయగా భారీగా నష్టపోయింది. ఐటీసీలో.. ఎల్ఐసీకి 15.86 శాతం వాటాకు సమానమైన 1,98,58,07,233 షేర్లు ఉన్నాయి. దీంతో ఐటీసీ షేరు 2 రోజుల్లో భారీ పతనంతో ఎల్ఐసీకి రూ. 11,460 కోట్ల మేర నష్టాలు వచ్చాయి. ఇంట్రాడే లో వాల్యూతో చూస్తే రూ. 12 వేల కోట్లకుపైనే నష్టం వాటిల్లింది. మొత్తానికి సిగరెట్లపై జీఎస్టీ, ఎక్సైజ్ సుంకం పెంపు.. ఎల్ఐసీకి భారీ నష్టాలు మిగిల్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa