ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ఉద్యోగుల పెద్ద మనసు..వరద బాధితులకు రూ.100 కోట్ల విరాళం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 03, 2024, 07:51 PM

తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు చాలా మంది నిరాశ్రయులుగా మారారు. ముఖ్యంగా ఖమ్మం పట్టణాన్ని మున్నేరు ముంచేసింది. మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ప్రజలు ఎక్కువగా బాధితులుగా మారారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో క్యాంపుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు ముందుకొస్తున్నారు. ఇప్పటికే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. టాలీవుడ్ హీరోలు జూ ఎన్టీఆర్.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షల చొప్పున రూ. కోటి, విశ్వక్‌సేన్ చెరో రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షలకు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు.


తాజాగా.. భారీ వర్షాలకు ఇల్లు వాకిలి కోల్పోయి నిరాశ్రయులుగా మారిన వారిని ఆదుకోవడానికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ముందుకొచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు తమ ఒకరోజు వేతనం విరాళంగా ఇవ్వనున్నట్లు ఉద్యోగుల తరఫున ప్రకటించింది. ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్లు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఒకరోజు బేసిక్ పేను సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మొత్తం రూ.100 కోట్లు ఉంటుందని సమాచారం.


కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల్లో ఉద్యోగులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ లచ్చిరెడ్డి వెల్లడించారు. భారీ వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రాణ నష్టం, తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లడం దురదృష్టకరమని చెప్పారు. ఈ విపత్తు నుంచి రాష్ట్రం త్వరగా కోలుకోవాలని తాము ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కష్ట సమయంలో ప్రభుత్వానికి తమవంతుగా అండగా నిలవాలని సాయం ప్రకటించినట్లు చెప్పారు.


కేసీఆర్ రూ.2 వేల కోట్లు ప్రకటించాలి ఇక విరాళాలపై సీఎం రేవంత్ కీలక కామెంట్స్ చేశారు. ఖమ్మం జిల్లాలో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన ఆయన.. కేసీఆర్ కుటుంబం దగ్గర రూ.లక్ష కోట్లు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి కేసీఆర్ రూ.2 వేల కోట్లు నిధులివ్వాలన్నారు. ఈ విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించాలని కోరారు. భారీ వరదల కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాలని ఆరోగ్యశాఖను ఆదేశించారు. మిషన్ కాకతీయలో జరిగిన దోపిడీ వల్లే చెరువు కట్టలు తెగిపోయాయని సీఎం రేవంత్ ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa