ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ఆలోచన,,,ట్రాన్స్ జెండర్లకు సరికొత్త ఉపాధి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 13, 2024, 07:15 PM

సంచలన నిర్ణయాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అధికారం చేపట్టిన రోజు నుంచి ఇప్పటివరకు ప్రతి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ.. పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ఉపాధి అవకాశాలు దొరక్క యాచించటమే తమ వృత్తి అన్నట్టుగా మారిపోయిన ట్రాన్స్ జెండర్లకు ఓ మార్గం చూపే దిశగా కీలక డెసిషన్ తీసుకున్నారు. తెలంగాణలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించటం ప్రాధాన్యతగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో.. ట్రాన్స్ జెండర్లకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.


ఇందులో భాగంగానే.. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాన్స్ జెండర్‌లను వాలంటీర్స్‌గా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హోంగార్డ్స్ తరహాలో ట్రాన్స్ జెండర్లకు కూడా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆసక్తి ఉన్నవారి వివరాలను సేకరించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే.. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా.. ప్రభుత్వం పలు ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు విదేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలను ఆహ్వానించారు కూడా.


కాగా.. ప్రస్తుతం ట్రాన్స్ జెండర్లు కూడా చదువుకుంటూ రకరకాల ఉద్యోగాలు చేస్తూ.. గౌరవంగా జీవిస్తున్నారు. కానీ.. చాలా మంది ఇప్పటికీ దుకాణాలలో, జంక్షన్ల దగ్గర, రైళ్లు, బస్సుల్లో ఇలా ఎక్కడపడితే అక్కడ.. బిక్షాటన చేస్తూ.. ప్రజలను ఇబ్బంది పెడుతుండటం గమనార్హం. అయితే.. జీవితంలో గౌరవంగా బతకాలని భావించే చాలా మంది ట్రాన్స్ జెండర్లకు మాత్రం సమాజంలో ఉపాధి అవకాశాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది వారిని పనుల్లో పెట్టుకునేందుకు నిరాకరిస్తుండటం శోచనీయం. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం గనక.. వర్కవుట్ అయితే.. జంక్షన్లలో డబ్బుల కోసం వాహనదారుల దగ్గర చేయి చాచిన ఆ ట్రాన్స్ జెండర్లు.. రేపు ట్రాఫిక్‌ను నియంత్రించే అవకాశాలున్నాయి.


మరోవైపు.. జీహెచ్ఎంసీ పరిధిలో రహదారులు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధితో పాటు పారిశుద్ధ్యం, ఇతర పనుల్లోని పురోగతిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు.. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించవద్దని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందేనని రేవంత్ రెడ్డి ఆదేశించారు. పనులు సరిగ్గా చేయని కాంట్రాక్టర్లకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను 15 రోజుల్లోగా అందించాలని సూచించారు. అంతేకాకుండా.. తప్పుడు రిపోర్టులు ఇచ్చే అధికారులపైన కూడా చర్యలు ఉంటాయని.. అటు యంత్రాంగానికి కూడా రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు.


శుక్రవారం (సెప్టెంబర్ 13న) రోజున సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌పై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa