ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేవంత్ రెడ్డికి 50 లక్షల చెక్కు అందజేసిన,,,బాలకృష్ణ కుమార్తె తేజస్విని

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 13, 2024, 07:19 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ ఇచ్చిన మాటను.. ఆయన రెండో కుమార్తె తేజస్విని నెరవేర్చారు. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కురిసిన భారీ వర్షాలతో.. పొటెత్తిన వరదలకు చాలా ప్రాంతాలు కకావికలమయ్యాయి. ఆ వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. చాలా మంది దాతలు తమకు తోచినంతలో రెండు తెలుగు రాష్ట్రాలకు సాయం ప్రకటించారు. సామాన్యుల నుంచి మొదలు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పారిశ్రామికవేత్తలు భారీ ఎత్తున విరాళాలు ప్రకటించారు.


ఇందులో భాగంగానే.. బాలకృష్ణ కూడా ఏపీ, తెలంగాణలో వరద బాధితుల కోసం తనవంతు సాయం ప్రకటించారు. రెండు రాష్ట్రాలకు గానూ.. చెరో 50 లక్షల రూపాయల విరాళంగా ప్రకటించారు. అయితే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన 50 లక్షలకు సంబంధించిన చెక్కును.. గురువారం (సెప్టెంబర్ 12న) రోజున తానే స్వయంగా వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబుకు బాలకృష్ణ అందించారు.


కాగా.. తెలంగాణకు ప్రకటించిన 50 లక్షల విరాళానికి సంబంధించిన చెక్కును.. ప్రభుత్వానికి అందించే బాధ్యతను బాలకృష్ణ తన రెండో కుమార్తె తేజస్విని అప్పగించారు. దీంతో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని.. శుక్రవారం (సెప్టెంబర్ 13న) రోజున సచివాలయానికి వెళ్లి కలిసిన తేజస్విని.. 50 లక్షల రూపాయల చెక్కును ఆయనకు అందజేశారు. ఈ క్రమంలో.. తేజస్వినిని సీఎం రేవంత్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డిని తేజస్వినికి పరిచయం చేశారు.


మరోవైపు.. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి సహకరిస్తూ.. ప్రఖ్యాత డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళం అందించింది. ఈ సందర్భంగా.. రెడ్డీస్ ల్యాబ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వి.నారాయణ రెడ్డి సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. చెక్కును అందించారు. సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌ సంస్థను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.


అయితే.. 2 వారాల క్రితం కురిసిన భారీ వర్షాలతో.. తెలంగాణ, ఏపీలో పెద్ద ఎత్తున వరదలు సంభవించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ముఖ్యంగా.. ఖమ్మం, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ లాంటి జిల్లాల్లో వరదలు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఇక.. ఏపీలో బుడమేరు ప్రకోపంతో విజయవాడ కకావికలమైంది. ఇప్పటికీ చాలా ఇండ్లు వరద నీటిలోనే ఉండటం బాధాకరం.


ఈ వరదలతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఎన్నో జీవితాలు రోడ్డు మీదికి వచ్చేశాయి. దీంతో.. వరద బాధితులను ఆదుకునేందుకు రాజకీయ నాయకులు, సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలతో పాటు సామాన్యులు కూడా తోచిన సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించగా.. అందులో భాగంగానే.. ఈరోజు ఆయన కూమార్తె తేజస్విని సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa