సంచలన నిర్ణయాలతో దూసుకుపోతూ.. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మరో కీలక ముందడుగు వేసేలా రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే భారీ పెట్టుబడులకు, బడా బడా కంపెనీల స్థాపనకు కేంద్రంగా మారిన తెలంగాణలో.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కంపెనీలకు కూడా ప్రోత్సాహం అందించేలా.. కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలోనే.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) కోసం బుధవారం (సెప్టెంబర్ 18న) రోజున.. కొత్త పాలసీని ప్రభుత్వం విడుదల చేయనుంది. రేపు ఉదయం 11 గంటలకు ఎంఎస్ఎంఈ కొత్త పాలసీని సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు.
తెలంగాణలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణను మరింత సులభతరం చేసేలా.. పారిశ్రామిక వేత్తల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించున్నట్టు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ప్రకటించారు. అమెరికాలో ఉన్నట్టుగానే.. తెలంగాణకు కూడా చాలా వ్యాపారావకాశాలు ఉన్నాయని ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి.. చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నట్టు గతంలో అభిప్రాయపడ్డారు. ఇందుకోసం.. రాష్ట్రంలో ఆరు నూతన పాలసీలను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.
ఇందులో భాగంగానే.. ఎంఎస్ఎంఈ పాలసీ, ఎగుమతి విధానం, కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ అనే ఆరు కొత్త పాలసీలను రూపొందించాలని గతంలో జరిగిన సమీక్షలో సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే.. రేపు ఎంఎస్ఎంఈ కొత్త పాలసీని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించబోతోంది.
డిఫెన్స్తో పాటు ఏరోస్పేస్ ఎంఎస్ఎంఈల టెక్నాలజీ అప్గ్రేడేషన్ను సులభతరం చేసేందుకు ప్రభుత్వం 100 కోట్ల నిధులను అందిచనుందని ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఇలాంటి సహాయాన్ని అందించే మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలువనుందని జయేష్ రంజన్ తెలిపారు. దేశంలోని ఏ ఇతర రాష్ట్రం కూడా.. రక్షణ, ఏరోస్పేస్ ఎంఎస్ఎంఈల సాంకేతికతను మెరుగుపరచుకోవడానికి ఇలా నిధులు కేటాయించట్లేదని జయేష్ రంజన్ అభిప్రాయపడ్డారు.
అయితే.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం కొత్త పాలసీని ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి శ్రీధర్బాబు గతంలోనే వెల్లడించారు. ప్రధానంగా.. సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్కు తోడ్పాటును అందించే దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
కాగా.. ఇప్పటికే పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ కేంద్రంగా ఉంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశాల్లో పర్యటించగా.. తెలంగాణలో భారీ ఎత్తున ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అందులో ఇప్పటికే.. కాగ్నిజెంట్ కంపెనీ తన ఐదో బ్రాంచ్ను ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన కూడా చేయటం గమనార్హం. మిగతా కంపెనీలు కూడా అతి త్వరలోనే.. తమ బ్రాంచ్లను ఏర్పాటు చేసుకోబోతున్నాయి. ఈ క్రమంలోనే.. పెద్ద పెద్ద కంపెనీలతో పాటు గ్రామస్థాయిలో సూక్ష, చిన్న, మధ్య తరహా కంపెనీలకు కూడా ప్రోత్సాహం ఇచ్చేలా.. రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త పాలసీ తీసుకొస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa