ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి.. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 17, 2024, 07:19 PM

ఖైర‌తాబాద్ మ‌హా గ‌ణ‌నాథుడు గంగ‌మ్మ ఒడికి చేరాడు. ఈ ఏడాది సప్తముఖ మాహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన లంబోదురుడు 11 రోజుల పూజల అనంతరం తల్లి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. స‌రిగ్గా 1.34 గంటలకు మాహా గణపతి నిమజ్జనం పూర్తయింది. మ‌హా గ‌ణ‌ప‌తి నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూసి తరించేందుకుభ‌క్తులు భారీ సంఖ్యలో త‌ర‌లివ‌చ్చారు. దీంతో హుస్సేన్ సాగ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాలు 'గ‌ణ‌ప‌తి బ‌ప్పా మోరియా' నినాదాల‌తో హోరెత్తిపోయాయి. మహా గణపతి నిమజ్జనాన్ని చూసి భ‌క్తులు తరించిపోయారు. ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నంబ‌ర్ 4 వ‌ద్ద గణపయ్యకు చివరి పూజలు నిర్వహించి నిమజ్జనం కార్యక్రమాన్ని పూర్తి చేశారు.


అంతకు ముందు ఖైరతాబాద్ మహా గణేషుడి శోభాయాత్ర కన్నుల పండుగలా సాగింది. ఇవాళ ఉదయం 6 గంటలకే చివరి పూజల అనంతరం గణపతి శోభాయాత్ర ప్రారంభించారు. టెలిఫోన్‌ భవన్‌, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్ బండ్‌కు శోభాయాత్ర చేరుకుంది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 దగ్గర పూజల అనంతరం ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం జరిగింది. సూపర్ క్రేన్ సాయంతో నిమజ్జనాన్ని పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిమజ్జనం పూర్తి చేశారు. అంతకు ముందు సీఎం రేవంత్ ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలను పరిశీలించారు. నిమజ్జనం ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.


ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాల శోభాయాత్ర కొనసాగుతోంది. గ్రేటర్ హైదరాబదాద్ పరిధిలో లక్షకు పైగా విగ్రహాల నిమజ్జనం జరగనుందని పోలీసుల అంచనా. నగరం నలుమూలల నుంచి వస్తున్న వినాయకులతో ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌రోడు ప్రాంతాలు సందడిగా మారాయి. నిమజ్జనాన్ని తిలకించేందుకు లక్షల సంఖ్యలో భక్తుల ట్యాంక్‌బండ్ వద్దకు తరలివస్తున్నారు. 'జై బోలో గణేశ్‌ మహరాజ్‌', 'గణపతి బప్పా మోరియా' నినాదాలతో పరిసరాలు మార్మోగుతున్నాయి. హుస్సేన్ సాగర్ వద్ద ఎటు చూసినా జనాలే. భక్తులతో ఆ ప్రాంతాలు కిటకిటలాడాయి.


ఇక బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతుంది. ఉదయం వేలం పాట నిర్వహించగా.. వేలం అనంతరం శోభాయాత్ర మెుదలైంది. హైదరాబాద్ పాతబస్తీ, చార్మినార్, ఎంజీ మార్కెట్ మీదుగా బాలాపూర్ గణనాథుడు నేడు సాయంత్రానికి హుస్సేన్ సాగర్‌ చేరుకోనున్నాడు. అనంతరం హుస్సేన్ సాగర్‌లో గణపయ్యను నిమజ్జనం చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa