తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా.. సీఎం రేవంత్ రెడ్డికి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విమర్శలు నడుస్తున్నాయి. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు.. ఏ సందర్భం దొరికినా.. మరే వేదిక అయినా.. గత ప్రభుత్వాన్ని విమర్శించకుండా సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించటంలేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇక.. కేటీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డికి అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉప్పు నిప్పులా ఉంటూ.. కనీసం ముఖం చూసుకునేందుకు కూడా వీలు లేకుండా తీవ్రమైన పదజాలంతో దూషించుకునే ఈ రాజకీయ ప్రత్యర్థులిద్దరూ.. ఇప్పుడు ఒకే వేదికను పంచుకోవాల్సిన సందర్భం వచ్చింది.
అదేంటీ.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరూ ఒకే వేదికను పంచుకోనున్నారా..? ఒకవేళ పంచుకుంటే ఒకరినొకరు పలకరించుకుంటారా..? షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారా..? అన్నది ఇప్పుడు రెండు పార్టీల శ్రేణుల్లో ఒకరకమైన ఉత్కఠంతో పాటు ఉత్సుకత నెలకొంది. అసలు విషయానికి వస్తే.. సీపీఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సెప్టెంబర్ 12వ తేదీన అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఏచూరి సంస్మరణార్థం ఆ పార్టీ రాష్ట్ర యూనిట్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 21న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించ తలపెట్టింది. ఈ సంస్మరణ సభకు.. అన్ని పార్టీల ప్రతినిధులకూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆహ్వానం పంపించారు.
ఈ సంస్మరణ సభకు విచ్చేయాలని.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, సీపీఐ స్టేట్ సెక్రెటరీ కూనంనేని సాంబశివరావు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, పలు వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులను ఆహ్వానించారు. అయితే.. రేవంత్ రెడ్డికి, కేటీఆర్కు మధ్య.. మాటలు తూటాలు కొంచెం గట్టిగానే పేలుతున్న వేళ.. ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకోనున్నారా.. అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠగా మారింది.
ఒక వేళ వీళ్లిద్దరూ ఈ కార్యక్రమానికి హాజరైనా.. ఒకేసారి వస్తారా.. లేదా ఒకరు వచ్చి వెళ్లిపోయిన తర్వాతా ఇంకొకరు వస్తారా అన్నది చర్చ నడుస్తోంది. ఇద్దరూ ఒకేసారి కార్యక్రమానికి హాజరైనా.. కేవలం సీతారాం ఏచూరి సేవలను స్మరించుకునేలా సభ సాగుతుందా.. లేదా రాజకీయ విమర్శలకు వేదికవుతుందా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అయితే.. మాజీ సీఎం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు.. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఆయనను పరామర్శించేందుకు వెళ్లారు. ఆ సమయంలో.. కేటీఆరే స్వయంగా రిసీవ్ చేసుకుని.. కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. అయితే.. తాను ముఖ్యమంత్రిని అయ్యానని చూపించుకునే అవకాశం అంతకంటే ఇంకొటి ఉండదనే అక్కడి వెళ్లానని ఓ ప్రముఖ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు అది వేరే విషయం. కానీ.. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా మారిపోవటంతో.. ఇద్దరూ ఒకే వేదికను పంచుకోవటమనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa