తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి తండాకు పాఠశాల ఉండేలా చర్యలు తీసుకుంటామని ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తుంటే.. తాజాగా విద్యాశాఖ విడుదల చేసిన నివేదిక విస్తుపోయేలా చేస్తోంది. పారిశుద్ధ్య నిధుల కోసం.. ప్రభుత్వానికి విద్యాశాఖ సమర్పించిన నివేదికలో.. కీలక అంశాలను పేర్కొంది. అయితే.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం.. 26 వేల 287 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నట్టుగా విద్యాశాఖ పేర్కొంది. అయితే.. వీటిల్లో 100 మంది విద్యార్థులకు పైగా ఉన్న పాఠశాలలు.. కేవలం 5 వేల 367 మాత్రమే. అంటే 20.41 శాతం మాత్రమే. అంతేకాదండోయ్.. ఇక జీరో స్టూడెంట్.. అంటే ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు.. ఏకంగా 1864 ఉన్నట్లు విద్యాశాఖ తాజా నివేదిక స్పష్టం చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య బాధ్యతలను 'అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ'లకు రేవంత్ రెడ్డి సర్కార్.. అప్పగించిన విషయం తెలిసిందే. అయితే.. పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య ఆధారంగానే ఈ కమిటీకి నిధులు ఇవ్వనున్నట్టు ముందుగానే సర్కారు నిబంధన పెట్టింది. ఈ నిధులను జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్టు పద్దు నుంచి విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం పెట్టిన నిబంధన మేరకు.. జిల్లాల వారీగా పాఠశాలలు, వాటిలో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య.. తదితర వివరాలను సేకరించిన విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించింది.
విద్యాశాఖ తయారు చేసిన నివేదికను గనుల శాఖకు అందజేసింది. ఆ నివేదికలోని వివరాల ప్రకారంజిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్టు కింద 3 నెలలకు అవసరమైన 40 కోట్ల 83 లక్షల నిధులను వెంటనే విడుదల చేయాలని సింగరేణి సీఎండీని కోరుతూ.. గనుల శాఖ సంచాలకుడు లేఖ రాశారు.
అయితే.. విద్యాశాఖ నివేదికలోని వివరాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అయితే.. సమగ్ర శిక్ష ప్రాజెక్టు సమావేశం కోసం గతేడాది జనవరిలో రేవంత్ రెడ్డి సర్కార్.. కేంద్ర విద్యాశాఖకు నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ సమయంలో విద్యాశాఖ రిపోర్టు ప్రకారం 2023-24 విద్యా సంవత్సరంలో జీరో స్టూడెంట్ పాఠశాలలు 1213 ఉన్నట్లు తేల్చింది. అయితే.. తాజాగా విద్యాశాఖ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం.. ఆ సంఖ్య మరింత పెరగటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యమే కాదు.. ఆందోళనను కూడా కలిగిస్తోంది.
ఓవైపు.. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి, ప్రతి తండాకు పాఠశాలలు ఉండేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్న నేపథ్యంలో.. ఇప్పటికే ఒక్క విద్యార్థి కూడా లేకుండా 18 వందల స్కూళ్లు ఉన్నాయని తేలటంతో.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa