ట్రెండింగ్
Epaper    English    தமிழ்

21 గ్రామాల మీదుగా,,,,,హైదరాబాద్ సమీపంలో 6 లైన్ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 10:08 PM

హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ది చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. నగర అభివృద్ధిపై మరింత ఫోకస్ పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ మూడు సిటీలు ఉండగా.. ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించతలపెట్టారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ ప్రాంతాల్లో ఈ ఫోర్త్‌సిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


ఇక ఈ ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా అక్కడ గ్రీన్‌ ఫీల్డ్‌ రహదారిని నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలిసింది. ఫ్యూచర్‌ సిటీలో స్కిల్‌ యూనివర్సిటీతో పాటుగా స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ గ్రీన్ ఫీల్డ్ రహదారి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్ ప్రణాళికలు, ట్రాఫిక్‌ అవసరాలను అనుసరించి కొత్తగా రహదారుల అనుసంధానం కోసం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసకుంది. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వరకు 40 కి.మీ పొడవునా గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డును నిర్మించాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.


ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్‌-13 రావిర్యాల నుంచి కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట వరకు మెుత్తం 6 లైన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించనున్నట్లు తెలిసింది. భవిష్యత్తులో మీర్‌ఖాన్‌పేట నుంచి రీజనల్‌ రింగ్‌ రోడ్‌ వరకు ఈ రహదారిని అనుసంధానించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లోని 21 గ్రామాల గుండా ఈ రహదారిని నిర్మించనున్నారు. గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి సంబంధించి హెచ్‌ఎండీఏ ఇప్పటికే రోడ్‌ ఎలైన్‌మెంట్‌ను కూడా రూపొందించింది. రేవంత్ సర్కార్ ఆమోదం రాగానే ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిసింది.


గ్రీన్ ఫీల్డ్ రహదారి వెళ్లే గ్రామాలు..


ఇబ్రహీంపట్నం మండలంలోని నారేపల్లి, హఫీజ్‌పూర్, మజీద్‌పూర్, ఆదిభట్ల, దండుమైలారం, ఇబ్రహీంపట్నం ఖాల్సా, కొంగరకలాన్, కప్పపహాడ్, ఫిరోజ్‌గూడ, మహేశ్వరం మండలంలోని కొంగర ఖుర్ద్, కందుకూరు మండలంలోని రాచలూర్, తిమ్మాయిపల్లి, తుమ్మలూర్, గూడూరు, గుమ్మడవెల్లి, లేమూర్, మదాపూర్, మంఖాల్, పంజాగూడ, మీర్‌ఖాన్‌పేట గ్రామాల గుండా నిర్మించనున్నారు.


కాగా, గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి కొత్త కొత్త సంస్థలు రావటంతో పాటుగా భూముల ధరలకు రెక్కలు వస్తాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఎకరం రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్లు ధర పలుకుతుండగా.. మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa