ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ మహిళా ఎంపీ హీరోయిన్ కంగనా రౌనత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 10:07 PM

కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీజేపీ హిమాచల్ ప్రదేశ్ మండి ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ పై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి.రాహుల్ గాంధీ లక్ష్యంగా బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను నిరసిస్తూ గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ నిర్వహించిన ధర్నాలో దానం నాగేందర్ మాట్లాడుతూ సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా రనౌత్ కు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై బీజేపీ నేతలు విమర్శలు చేయడాన్ని దేశ ప్రజలు సహించరన్నారు. రాహుల్ గాంధీపై అనుచిత విమర్శలు చేసిన ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీందర్ సింగ్ పైన, ఇతర బీజేపీ నేతలపైన సుప్రీం కోర్టు, ఢిల్లీ కోర్టు, డీజీపీలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎప్పుడూ ఎదో ఒక వివాదంలో ఉండే ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జీవితం, ఎమర్జెన్సీ ఆధారంగా తెరకెక్కించిన వివాదాస్పద 'ఎమర్జెన్సీ' చిత్రం నిర్మాణంతో కాంగ్రెస్ శ్రేణులకు టార్గెట్ గా మారింది.


తాజాగా ఆమెకు ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. చండీగఢ్ లోని ఓ జిల్లా కోర్టు కంగనాకు నోటీసులు జారీ చేసింది. జిల్లా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, న్యాయవాది రవీందర్ సింగ్ బస్సి ఆమెపై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ మూవీ ద్వారా కంగనా సిక్కుల ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించిందని అడ్వకేట్‌ రవీందర్‌ సింగ్‌ బస్సీ ఆరోపించారు. కంగనా దర్శకత్వం వహించిన ఎమర్జెన్సీ మూవీ వాస్తవానికి సెప్టెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. ఇప్పటికే సినిమా ట్రైలర్ కూడా విడుదలయింది. ఇందులో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ పాత్రని కంగనా పోషించింది. అయితే, ఈ చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ హర్యానా హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. వివాదాస్పద సన్నివేశాలను తొలగించిన తర్వాతే సినిమాను విడుదల చేయాలని పిటిషన్ లో కోరారు. ఈ సినిమాకు ఇంకా సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో... విడుదలను వాయిదా వేశారు. సెన్సార్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత కొత్త విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. సినిమా విడుదల వాయిదా పడటంతో తాను ముంబయి బాంద్రాలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న తన బంగ్లాను రూ.32 కోట్లకు విక్రయించేసినట్లుగా తాజాగా కంగనా వెల్లడించారు. తాజాగా తన పెళ్ళిపై స్పందించిన కంగనా తన ఎంపీ పదవి ముగిసేలోగా పెళ్ళి చేసుకుంటానని కామెంట్ చేసింది. పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం అయితే బాగుంటుందని అభిప్రాయపడింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa